నగర కార్పొరేషన్ ఎన్నికలు అంటే అతి సాధారణమైనవి. రాష్ట్రస్థాయివి కావు. కనీసం జిల్లా స్థాయివి కూడా కావు. కార్పొరేషన్లకు చట్టాలు చేసే అధికారం లేదు. వీటి అధికార పరిమితి నగరంలోని కొన్ని వార్డులు మాత్రమే. ఇవి కొద్దిపాటి లక్షల ఖర్చుతో ముగిసే ఎన్నికలు. అలాంటి ఈ ఎన్నికలను కూడా రాజకీయపార్టీలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. శాసనసభ ఎన్నికల కంటే కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. కారణం ఏమిటంటే కార్పొరేటర్లకు ఈ విజయం కాసులపంటను పండిస్తోంది. హైదరాబాద్ నగరం రాష్ట్ర రాజధాని కావడం, పరిశ్రమలు, నిర్మాణాలతో శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో భవన నిర్మాణ కార్యకలాపాలు నిరంతరం సాగుతుంటాయి. వీటన్నిటి నిర్మాణం సజావుగా సాగాలంటే కార్పొరేటర్లకు ముడుపులు ఇచ్చుకోవాల్సిందే. తన పరిధిలో కార్పొరేటర్ కనీసం అయిదేళ్ల కాలంలో యాభై నుంచి వందకోట్లు పోగేయగలడు. అందుకే ఈ ఎన్నికలలో విజయం కోసం ప్రధానపార్టీలు అన్నీ చెమటోడుస్తున్నాయి.
ఇప్పటివరకు నగర కార్పొరేషన్ టీఆరెస్ చేతిలో ఉన్నది. మొన్న దుబ్బాక ఉప ఎన్నికలో అనూహ్య విజయాన్ని సాధించడంతో బీజేపీ కూడా ఉత్సాహంతో ఎన్నికల్లో తలపడుతుంది. తమకేదో కొత్త బలం వచ్చినట్లు వారు ఊహించుకుంటున్నారు. ప్రజలు కూడా బీజేపీ నాయకుల ప్రకటనలు, వ్యవహారశైలి చూసి ఆ పార్టీ బలం పెరుగుతున్నదేమో అని సందేహిస్తున్నారు. మేయర్ పీఠం దక్కాలంటే ఏ పార్టీకైనా కనిష్ట ఆధిక్యత డెబ్బై ఆరు స్థానాలు గెలుచుకోవాలి. కానీ, బీజేపీకి అంత బలం ఉన్నదా అని ఎవరికైనా అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం టీఆరెస్ కు తొంభై తొమ్మిది స్థానాలు ఉన్నాయి. మజ్లీస్ పార్టీకి నలభై నాలుగు స్థానాలు ఉన్నాయి. బీజేపీకి కేవలం నాలుగు స్థానాలు మాత్రమే ఉన్నాయి. కాంగ్రెస్ కు మరీ ఘోరంగా రెండు సీట్లు ఉన్నాయి. ఎవరి బలం పెరిగినా, ఎవరి బలం తగ్గినా, మజ్లీస్ వారి స్థానాలు మాత్రం చెక్కు చెదరవు. ఒకటి అటూ ఇటూ అవుతుందేమో కానీ, నలభైకి తక్కువ మాత్రం రావు. ఒకవేళ టీఆరెస్ కు పది సీట్లు తగ్గుతాయనుకున్నప్పటికీ ఎనభై అయితే గ్యారంటీ. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి పది స్థానాలైనా రావడం కష్టమే అని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. మరొక విషయం ఏమిటంటే…టీఆరెస్ కు ముప్ఫయికి పైగా ఎక్స్ అఫిషియో సభ్యుల బలం ఉన్నది. టీఆరెస్ కు ఎన్ని సీట్లు తగ్గినా కనీసం యాభయ్ స్థానాలు గెలిచినా కార్పొరేషన్ భవనం మీద గులాబీ జెండాయే ఎగురుతుంది.
ఇక ఈ సందర్భంలో బీజేపీ చేస్తున్న ప్రచారశైలి చాలా అభ్యంతరకరంగా ఉన్నది. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీలు ఓట్లు వేస్తున్నారని బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించడం ఆశ్చర్యకరం. నిజానికి రోహింగ్యాలు, పాకిస్తానీలు అలా అక్రమంగా ఉంటే వాటిని నివారించడం కేంద్రప్రభుత్వ బాధ్యత. సాక్షాత్తూ కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి హైద్రాబాద్ వాసే. ఆయన సొంత నగరంలోనే ఇతర దేశస్తులు ఓట్లు వేస్తుంటే అందుకు బాధ్యత వహించాల్సింది ఆ పార్టీయే. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం పట్ల అసభ్యంగా మాట్లాడటం సీమాంధ్రులను ఆగ్రహంలో ముంచెత్తింది. తన వాచాలతకు రఘునందన్ రావు విచారాన్ని వ్యక్తం చేసినప్పటికీ ఆయన మాటలను మర్చిపోవడం కష్టమే. పైగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని సీమాంధ్రులు అందరూ బీజేపీ అంటేనే మండిపడుతున్నారు. నగరపరిధిలో కనీసం పది నియోజకవర్గాలలో సీమాంధ్రుల ఓట్ల ప్రభావం అధికంగా ఉంటుంది.
ఓటమి అంటే బీజేపీకి భయం వేసినట్లుంది…కనీసం మంత్రులు కూడా పెద్దగా సీరియస్ గా తీసుకుని ప్రచారం చెయ్యని కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ను కూడా రంగంలోకి దించుతున్నారంటే శాసనసభ ఎన్నికల కన్నా మిన్నగా కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ దడదడలాడుతున్నట్లు తోస్తున్నది. మరి భాజపా అగ్రనేతల ప్రచారం ఏ మేరకు పనిచేస్తుందో రాబోయే నెల నాలుగోతారీకు తెలుస్తుంది.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు