“ది సర్దార్ ఆఫ్ స్పిన్” ఇకలేరు… ఈ రికార్డులు మాత్రం ఉన్నాయి!

వరల్డ్ కప్ క్రికెట్ లో దుమ్ముదులుపుతున్న టీం ఇండియా ఫెర్మార్మెన్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న క్రికెట్ అభిమానులకు ఒక చేదు వార్త. భారత క్రికెట్‌ దిగ్గజం, టీం ఇండియా మాజీ కెప్టెన్‌ బిషన్‌ సింగ్‌ బేడీ (77) ఇక లేరు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. తనదైన స్పిన్ బౌలింగ్‌ తో క్రీడాభిమానులకు ఎన్నో చిరస్మరణీయ జ్ఞాపకాలను మిగులుస్తూ ఆయన కన్నుమూశరు.

సెప్టెంబర్ 25 – 1946న అమృత్ సర్‌ లో జన్మించిన ఆయన.. 1967లో జాతీయ జట్టులోకి అరంగేట్రం చేశారు. అనంతరం 1979లో తొలి టెస్టు ఆడాడు. ఈ క్రమంలో కొద్దికాలంలోనే దిగ్గజ స్పిన్నర్‌ గా ఎదిగి టీమిండియాకు ప్రధాన బౌలర్‌ గా మారారు. అలా… బిషన్‌ సింగ్ బేడీ భారత్‌ తరఫున 1966 నుంచి 1979 వరకు ఆడారు. ఇందులో భాగంగా… 67 టెస్టుల్లో 266 వికెట్లు తీశారు.

22 మ్యాచ్‌ లకు కెప్టెన్‌ గానూ వ్యవహరించారు. 10 వన్డేల్లో ఆడి 7 వికెట్లు తీశారు. ఈ క్రమంలో… స్పిన్ బౌలింగ్ రివల్యూషన్‌ రూపశిల్పులలో ఒకరిగా క్రికెట్‌ లో తనదైన ముద్ర వేశారు. ప్రధానంగా… భారత్‌ తొలి వన్డే విజయంలో ఎరపల్లి ప్రసన్న, బీఎస్‌ చంద్రశేఖర్, ఎస్‌. వెంకటరాఘవన్‌ లతో కలసి బిషన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. 1975 ప్రపంచ కప్‌ లో ఈస్ట్‌ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ లో తన అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు (12-8-6-1) నమోదు చేశారు.

ఇలా టీం ఇండియా తరుపున ఎన్నో రికార్డులు సృష్టించారు. 1990లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ పర్యటనల సమయంలో ఇండియా క్రికెట్ టీం కు మేనేజర్‌ గా ఉన్నారు. జాతీయ సెలెక్టర్‌ గానూ పనిచేశారు. ఇదే సమయంలో మణిందర్ సింగ్, మురళీ కార్తిక్ వంటి అనేక మంది ప్రతిభావంతులైన స్పిన్నర్లకు మెంటార్‌ గా ఉన్నారు. ఈ క్రమంలో క్రికెట్‌ లో ఆయన సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1970లోనే పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

అలాంటి లెజెండరీ క్రికెటర్ సొమవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య అంజు, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ సమయంలో ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తంచేశారు. క్రికెట్‌ పట్ల ఆయనకు ఉన్న అభిరుచి అచంచలమైందని.. తన స్పిన్‌ బౌలింగ్‌ తో భారత్‌ కు చిరస్మరణీయ విజయాలు అందించడంలో కీలకంగా వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

ఇదే సమయంలో బిషన్ సింగ్ బేడీ మృతిపట్ల కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఇందులో భాగంగా… క్రికెట్ ప్రేమికులు ‘ది సర్దార్ ఆఫ్ స్పిన్’ అంటూ ముద్దుగా పిలుచుకొనే వారని గుర్తూ చేశారు. ఆయన మరణ వార్త చాలా బాధించిందని, క్రీడా రంగానికి అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ ఖర్గే ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరోవైపు.. బిషన్‌ సింగ్‌ బేడీ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఆయన సేవల్ని గుర్తు చేసుకుంటూ పలువురు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. వీరిలో… కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌, కేంద్ర మాజీ మంత్రి హర్‌ సిమ్రత్‌ కౌర్‌, మాజీ క్రికెటర్లు గౌతం గంభీర్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ తో పాటు బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌, పలువురు ప్రముఖులు ట్విటర్‌ లో పోస్టులు పెట్టారు.