Akividu Rama Temple: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని పెదపేట రామాలయం నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆలయానికి సంబంధించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా లేదా కూల్చివేతలు చేయాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశిస్తూనే, ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వివాదం నేపథ్యం ఏమిటి? ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు పెదపేటలో ఉన్న పురాతన రామాలయం శిథిలావస్థకు చేరడంతో, దాని పునర్నిర్మాణంపై స్థానికంగా రెండు వర్గాల మధ్య భేదాభిప్రాయాలు వ్యతిరేకతకు దారితీశాయి. శిథిలావస్థలో ఉన్న రామాలయాన్ని అదే స్థలంలో పునర్నిర్మించాలని ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. అక్కడ రామాలయం వద్దని, గొంతెనమ్మ ఆలయాన్ని నిర్మించాలని మరో వర్గం కోరుతోంది.
ఈ నేపథ్యంలో శ్రీరామనవమి పర్యటన సందర్భంగా జరిగిన ఘర్షణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పరస్పర దాడుల్లో పలువురు గాయపడగా, పోలీసులు 57 మందిపై కేసులు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు. రఘురామకృష్ణరాజు పట్టుదల.. విరాళాల సేకరణఈ వివాదంలో జోక్యం చేసుకున్న డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, అక్కడ రామాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించి తీరుతామని ప్రకటించారు.

ప్రముఖ స్థపతి శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. విరాళాలు సామాన్య భక్తుల నుంచి రూ. 100 నుండి రూ. 10,000 వరకు విరాళాలు సేకరిస్తూ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆకివీడు ఘటనలు మరియు ఆలయ నిర్మాణంపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు, శాంతిభద్రతల దృష్ట్యా మరియు చట్టపరమైన నిబంధనల మేరకు ఈ క్రింది ఆదేశాలిచ్చింది.
:- ప్రభుత్వ శాఖల నుంచి అధికారిక అనుమతి పత్రాలు లేకుండా ఎలాంటి పనులు మొదలుపెట్టకూడదు.
:- ఈ వివాదంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.
:- తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
కోర్టు ఆదేశాలతో ఇప్పుడు బంతి ప్రభుత్వ పరిధిలోకి వెళ్లింది. ప్రభుత్వం ఏ వర్గానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందో లేదా మధ్యేమార్గం అనుసరిస్తుందో వేచి చూడాలి.

