Jada Shravan Kumar: గత ప్రభుత్వ హయాంలో తాము చేసిన పోరాటాల వల్లే నేడు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలో ఉందని, ఈ అధికారం తాము పెట్టిన భిక్ష అని జైభీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులోని చర్చిలకు నోటీసుల అంశంపై మొదలైన వివాదం, ఇప్పుడు రఘురామకృష్ణరాజు వర్సెస్ జడ శ్రవణ్ కుమార్ మధ్య వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరింది.
2024 ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు తనకు బంపర్ ఆఫర్ ఇచ్చారని శ్రవణ్ కుమార్ వెల్లడించారు.
“నేను కనుక టీడీపీ ఆఫర్ను అంగీకరించి ఉంటే, ఈరోజు రాష్ట్రంలో నాలుగో మంత్రిని అయ్యేవాణ్ణి. రఘురామకృష్ణరాజుకు నామినేషన్కు ఒక్కరోజు ముందు సీటు ఇస్తే, నాకు ఎనిమిది నెలల ముందే చంద్రబాబు ఆఫర్ ఇచ్చారు. టీడీపీలో రఘురామది 173వ సీటు అయితే, నాది నాలుగో సీటు అయ్యేది” అని ఆయన పేర్కొన్నారు.
గత ఐదేళ్ల పోరాటాన్ని గుర్తు చేస్తూ నారా లోకేష్ తన గురించి చేసిన వ్యాఖ్యలను శ్రవణ్ కుమార్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. “టీడీపీ పాలిట మీరు మహావిష్ణువు లాగా మమ్మల్ని కాపాడుతున్నారు” అని లోకేష్ స్వయంగా అన్నారని శ్రవణ్ గుర్తు చేశారు. తమ పార్టీ మొత్తం శ్రవణ్ కుమార్కు రుణపడి ఉంటుందని చంద్రబాబు అన్నారని, ఈ విషయాలను కావాలంటే వారిద్దరినీ అడిగి తెలుసుకోవాలని సవాల్ విసిరారు.

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై విరుచుకుపడుతూ.. “మేము ఎమ్మెల్యేలుగా గెలవలేదు కాబట్టి మీ మాటలు పడాల్సి వస్తోంది. కానీ మాకు కూడా కాలం వస్తుంది, అప్పుడు సమాధానం చెబుతాం” అని హెచ్చరించారు. ఉండి నియోజకవర్గంలో ఆఖరి నిమిషంలో టికెట్ తెచ్చుకున్న రఘురామకు, తమ పోరాట విలువ తెలియదని ఎద్దేవా చేశారు.
గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్పై పోటీ చేసిన జడ శ్రవణ్ కుమార్ ఓటమి పాలయ్యారు. ఆయనకు నోటా కంటే తక్కువ ఓట్లు రావడంపై అప్పట్లో చర్చ జరిగింది. అయితే, గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఉద్యమం మరియు ఇతర సామాజిక అంశాలపై ఆయన చేసిన న్యాయపోరాటాలు కూటమికి కలిసి వచ్చాయని శ్రవణ్ కుమార్ బలంగా నమ్ముతున్నారు.
ప్రస్తుతం చర్చిల నోటీసుల వ్యవహారంతో మొదలైన ఈ రాజకీయ రచ్చ ఏ తీరానికి చేరుతుందో వేచి చూడాలి.

