దురాశ దుఃఖానికి చేటు – చిన్న పిల్లలకు బడిలో చెప్పే ఈ నీతి సామెతను నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడికి కూడా వర్తింపజేయవచ్చు. ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ ను ఉపయోగించుకుంటూ , అమరావతిలో రెండేళ్లలో నాలుగైదు మహా భవనాలను నిర్మించి రాజధాని నిర్మాణానికి శుభం కార్డు వేసి ఉంటే… ఇలా జరిగి ఉండేది కాదు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను పెట్టుకునేది కాదేమో.
అమరావతిని పదేళ్లలో కోటిన్నర జనాభా గల నగరంగా తీర్చిదిద్ది, షాంఘై కంటే పెద్దగా, సింగపూర్ కంటే సుందరంగా తీర్చిదిద్దాలను కోవడం ఏమిటి? ఐదేళ్ల తర్వాతే కాదు, ఎంతకాలమైనా తాము అధికారంలో ఉంటాం కాబట్టి ఏళ్లతరబడి రాజధాని నగరాన్ని నిర్మించుకుంటూ పోదామని అనుకోవడమేమిటి? ఈ లోపు రాజధానికి భూములిచ్చిన రైతులను వంచనకు గురిచేయడమెందుకు?
చీలిపోయి చిన్నరాష్ట్రమైపోయిన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చైనాలోని షాంఘై అంత మహానగరం అవసరమా? అమరావతి ప్రాంతం వ్యవసాయానికి తప్ప పనికిరాదు. అక్కడ గనులు లేవు. సముద్ర రేవులు లేవు. పర్యాటక, వినోద కేంద్రాలు లేవు. కేవలం ప్రభుత్వ ఆఫీసులతో, ఏవో కొన్ని సాఫ్ట్ వేర్ సంస్ధలతో మహానగరం ఎలా రూపుదిద్దుకుంటుంది? ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఇతర రాజకీయ పార్టీల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా చేసిన తప్పిదానికి ఇప్పుడు స్థానిక రైతులే కాకుండా ఆంధ్రులు అందరూ ఎంతోకొంత నష్టపోయారు. ఫోకస్ అంతా అమరావతి మీద ఉండడం మెజారిటీ ప్రజలకు నచ్చ లేదు.
ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ములు విడిపోయారనుకుందాం. అన్నకు కొంచెం పొలంతో పాటు ఇల్లు వచ్చింది. తమ్ముడికి పొలం వచ్చింది కానీ ఇల్లు లేదు. అప్పుడు తమ్ముడు ఏం చేయాలి? వ్యవసాయం మీద, ఇతరత్రా కష్టపడిన తర్వాతే ఇంటి నిర్మాణం గురించి బాగా ఆలోచించి పొదుపుగా ఇల్లు కట్టుకోవాలి. అలా కాకుండా పొలాన్ని పట్టించుకోకుండా ఏళ్ల తరబడి ఇల్లు కట్టుకుంటూ పొతే ఎలా ఉంటుంది? అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పు అక్షరాలా ఇదే. అలాగే ఆదాయానికి, విలాసానికి ఒక రీజనబుల్ నిష్పత్తి ఉండాలి. పట్టణాభివృద్ధికి, గ్రామీణాభివృద్ధికి మధ్య సమతౌల్యం ఉండాలి. గ్రామీణ ప్రధానమైన రాష్ట్రంలో అధిక నగరీకరణ అవశ్యం కాదు. చంద్రబాబు నాయుడు ప్రపోర్షన్ ను, ప్రాక్టికాలిటీని మరిచిపోయి చేసిన ఘోర తప్పిదమిది. భవిష్యత్తులో ఏ రాష్ట్రంలోనూ, ఏ పాలకులూ చేయకూడని ఘోర తప్పిదమిది.
అమరావతి ఇప్పుడు ఆగిపోయిన సినిమా. ఇది చాలా బాధపడవలసిన విషయం. రాజధాని కోసం, తమ సొంత అభివృద్ధి కోసం భూములిచ్చిన రైతుల తప్పు ఎంత మాత్రం లేదు. సినిమా హిట్ అయితే చాలా లాభాలు వస్తాయని ఒక నిర్మాత వంద మంది దగ్గర డబ్బు తీసుకుని, సినిమా పూర్తి చేయలేక చతికిల పడితే ఎవరికి నష్టం? నిర్మాతకు కాదు, ఆ వేలాది మంది ఆశావహులకు ఇక్కడ అలాగే జరిగింది. అమరావతిలో కట్టిన సచివాలయ భవనాన్ని, హైకోర్టు ప్రాంగణాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. షాంగై, సింగపూర్ లను ఊహించుకుని వేసిన సుదీర్ఘమైన ఫోర్ వే రోడ్లను ఏమి చేసుకోవాలి? మళ్ళీ పంటకు పనికి రాని భూములను ఏమి చేసుకోవాలి? ఇప్పటి వరకు పట్టణ రూపునే సంతరించుకొని ఈ ప్రాంతాన్ని అర్బన్ ఏరియాగా ఏ విధంగా అభివృద్ధి చేస్తారు?
ఏపీసీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీని ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి అన్నట్టు ఉన్న ఈ పరిస్ధితిలో పేరు మారిన ఈ కొత్త సంస్ధ చేసేది ఏముంటుంది? ముప్పై పల్లెటూర్లు మెట్రోగా ఎలా అభివృద్ధి చెందుతాయి? ఆగిపోయిన సినిమాకు అతుకులేస్తే చాలదు. కొత్త స్క్రిప్ట్ కావలసిందే. అమరావతి గ్రామాల రైతులకు మెరుగైన మార్గం చూపాల్సిందే.
