రూ 150 కోట్లు … అందుకే సిబిఐ వద్దన్నారా?

Chandra Babu Naidu

 “ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ప్రముఖ వ్యక్తికి రూ 150 కోట్లు చెల్లించిన ఆధారాలు లభించాయి.” “మూడు ప్రధాన కాంట్రాక్టు కంపెనీలు హవాలా ఏజెంట్లు, బ్రోకర్లతో నల్లధనాన్ని విదేశీ పెట్టుబడుల రూపంలో తెచ్చిన ఆధారాలు దొరికాయి.””డైరీలు, ఈమెయిల్ ఉత్తర ప్రత్యుత్తరాలు, వాట్సాప్ సందేశాలు, నోటు పుస్తకాలు, విడి కాగితాలు లభించాయి.” “ఢిల్లీ, ఆగ్రా, పూణే, ముంబయి, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ఈరోడ్ నగరాల్లో 82 ప్రదేశాల్లో దాడులు, పరిశోధనలు జరిగాయి.” “లెక్కలు లేని ధనం, చిరునామా లేని కంపెనీలు అనేకం ఉన్నట్టు తేలింది. చిరునామా లేని కంపెనీల ద్వారానే హవాలా లావాదేవీలు జరిగాయి. హవాలా ప్రతినిధులు చిరునామా లేని కంపెనీల ద్వారా విదేశీ పెట్టుబడుల రూపంలో నల్లధనాన్ని తిరిగి తెచ్చినట్టు ప్రాధమిక ఆధారాలు ఉన్నాయి.” ఇవన్నీ ఎవరో చెప్పినవి కావు. సాక్షాత్తు దేశ ఆదాయపన్ను శాఖ అధికారులు చెప్పినవి. ఈనెల 11 మరియు 13 తేదీల్లో ఆశాఖ అధికారి, శాఖ అధికారప్రతినిధి అయిన సురభి అహ్లువాలియా స్వయంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపిన వివరాలు.

డైరీల్లో, వాట్సాప్ సందేశాల్లో ఈమెయిలు సందేశాల్లో అనేక పేర్లు, ఆధారాలు లభించాయి. బోగస్ కంపెనీలు, చిరునామాలో కనిపించని కంపెనీలు, అసలు చిరునామాయే లేని కంపెనీలు… ఇలా అనేకం అధికారులకు దొరికాయి. వీటిలోనే ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఒక ప్రముఖ వ్యక్తికి రూ 150 కోట్లు చెల్లించినట్టు సాక్షాధారాలు ఉన్నాయని సదరు అధికారి విడుదల చేసిన ప్రకటనల్లో స్పష్టం చేశారు. ఆ ప్రముఖ వ్యక్తి ఎవరో సదరు అధికారి చెప్పకపోయినా అధికారులు దాడులు నిర్వహించిన ప్రదేశాలు, వాటి యజమానుల పేర్లు ఆధారంగా అన్ని వేళ్ళూ చంద్రబాబు వైపే చూపిస్తున్నాయి. అనేకమంది పారిశ్రామిక వేత్తలు, చిన్నా చితకా వ్యాపార వేత్తలు, పెట్టుబడి దారులు, హవాలా ఏజెంట్లు, బ్రోకర్లు ఇలా అనేకమందితో పాటు చంద్రబాబు వద్ద 1995 నుండి 2019 వరకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావు ఇంట్లో కూడా అధికారులు సోదా చేశారు. అందుకే చంద్రబాబుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. సుదీర్ఘకాలం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావుపై దాడి జరగడంతో అంతకు ముందు చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రకటనలు పునఃశ్చరణ చేసుకోవాల్సి వస్తోంది.

బీజేపీతో పొత్తు తెంచుకున్న తర్వాత “ధర్మ పోరాట దీక్ష” పేరుతో రాష్ట్రంలో పలు ప్రాంతాలతో పాటు దేశరాజధానిలో కూడా నిర్వహించిన అనేక సభల్లో చంద్రబాబు ఒక మాట చెప్పేవారు. బీజేపీ తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని, ఏదో ఒక సాకుతో తనను అరెస్టు చేసి జైలుకు పంపే ప్రయత్నం చేస్తుందని అనేవారు. అంతే కాదు, ఒకవేళ తనను అరెస్టు చేసే ప్రయత్నం జరిగితే ప్రజలంతా తన చుట్టూ వలయంలా నిలబడి తనను కాపాడుకోవాలని వేడుకున్నారు. మరోవైపు రాష్ట్రంలోకి సిబిఐ అధికారులు రాకుండా “సాధారణ సమ్మతి”ని రద్దు చేస్తూ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీతో ఆయన విడిపోయిన తర్వాత తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసి సిబిఐకి రాష్ట్రంలోకి అనుమతి ఇచ్చింది. బీజేపీ ఎందుకు తనను అరెస్టు చేస్తుందో చంద్రబాబుకు ముందే తెలుసు. తాను చేస్తున్న ఆర్ధిక లావాదేవీల గురించి వాటి వల్ల కలిగే ప్రతికూల పరిస్థితుల గురించి తెలియకుండానే చంద్రబాబు ఇంత సాహసం చేసి ఉండరు. కాకపోతే వ్యవస్థలను “మేనేజ్” చేయడం అలవాటు కాబట్టి, హై కోర్టు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు బహిరంగంగా విందులు ఇవ్వగలడు కాబట్టి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని మొదట ఊహించలేదు. బీజేపీతో విడిపోయిన తర్వాత, తనకంటే మొండివాడు, తనకంటే ఎక్కువగా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన నరేంద్ర మోడీ అంటే చంద్రబాబుకు కొంతమేర భయం వేసింది. అందుకే సిబిఐని రాష్ట్రంలో అనుమతించకుండా నిషేధాజ్ఞలు విధించారు. తనను అరెస్టు చేస్తే వలయంలా నిలబడి కాపాడుకోండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ పరిణామాల క్రమంలోనే ఆదాయపన్ను శాఖ అధికారుల దాడులు, సోదాలు ఆ తర్వాత విడుదల చేసిన పత్రికా ప్రకటన చూడవలసి వస్తోంది. అధికారులు దాదాపు రూ 6 వేలకోట్లకు పైగా హవాలా రూపంలో దేశాలు తిరిగి మళ్ళి విదేశీ పెట్టుబడుల రూపంలో ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చిందని, ఇదంతా 2015 నుండి 2019 మార్చి వరకూ జరిగిందని తెలుస్తోంది. అయినా దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుణ్ణి అని, అనుభవశాలిని అని, సమర్ధుణ్ణి, ముందుచూపు ఉన్న వ్యక్తిని అని చెప్పుకునే చంద్రబాబు తనవద్ద దాదాపు రెండు దశాబ్దాలపాటు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిని అలా ఎలా వదిలేయగలిగారు? ఆయన దగ్గర డైరీలు, నోటుపుస్తకాలు ఉంటాయని, ఈమెయిలు, వాట్సాప్ సందేశాలు ఉంటాయని, అవి ఎప్పటికైనా, ఎవరికైనా దొరుకుతాయని, అవి దొరికితే తన బండారం బయటపడుతుందని గ్రహించలేక పోయారా?

Written by Aditya for Telugurajyam.com