భారత దేశంలో కోట్లాది మంది ప్రజలు రోజూ ఏదో ఒక సందర్బంలో జైహింద్ అనాల్సిందే. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ జైహింద్ నినాదంతోనే ముగుస్తుంటాయి. ప్రధాని మోదీ వచ్చాక జైహింద్ మరీ ఎక్కువగా వినబడుతూ ఉంది. జైహింద్ అనే మాట భారతజాతీయ సంస్కతిలో విడదీయ రాని భాగమయింది. వందేమాతరం నిజానికి పాతబడిపోయినా, శాశ్వతంతా నిలబడింది జైహింద్ అనే మాటయే. భారత స్వాతంత్య్ర పోరాటకాలంనుంచి ఇలా కొనసాగుతున్న సంప్రదాయాలు చాలా తక్కువ. వైబ్రాంట్ గా కొనసాగుతున్నది జైహింద్ అనే మాటయే. అయితే, ఇంత శక్తి వంతమయిన ఈ మూడక్షరాల మాటను భారతీయులకు అందించింది హైదరాబాద్ యువకుడని చాలామందికి తెలియదు. జై హింద్ గ్రీటింగ్ వాచకం వెనక చాలా కథ ఉంది.

భారతీయులందరి నోళ్లలో నానే ఈ శక్తి వంతమయిన హిందూ నినాదాన్ని తయారుచేసింది హైదరాబాద్ కు చెందిన ముస్లిం కుర్రవాడు. ఆయన పేరు అబిద్ హసన్ ‘శాఫ్రాని’. శాఫ్రని వెనకకూడా మరొక కథ ఉంది.
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భారతీయులే కాదు, ఎంతో మంది విదేశీయులు కూడా పాల్గొన్నారు. కొందరు నేరుగా పోరాటంలో పాల్గొంటే మరికొందరు తమకు నచ్చిన రూపాలలో బ్రిటిష్ వాళ్ల మీద వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇలాంటి కుటుంబాలలో అబిద్ కుటుంబం ఒకటి. అబిద్ జర్మనీలో చదువుతున్న ఇంజనీరింగ్ కోర్సు మధ్యలో మానేసి నేతాజి సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ ఎ) లో చేరాడు. అజాద్ హింద్ ఫౌజ్ లో అన్ని మతాలవాళ్లు వుండేవాళ్లు. అందరికి ఒకటే కామన్ కిచెన్ ఉండేడి. అపుడు అందరిని సమానంగా పిలుచుకునేందుకు ఒక మాట అవసరమయింది. ఏదయినా ఒక హిందూ మాట కోసం అన్వేషణ మొదలయింది. అబిద్ రెండు మాటలు ఇచ్చారు. మొదట హెలో అని మాట సూచించారు. దానికి ఆయనను అంతా ఆటపట్టించారు. తర్వాత ఆయన జైహింద్ అనే మాట సూచించారు. సుభాస్ బోస్ కు అది బాగా నచ్చింది. అప్పటి నుంచి భారత జాతీయ విప్లవ నినాదం అయింది.
అబిద్ జర్మనీ ఎందుకు వెళ్లాడు
ఇంజనీరింగ్, న్యాయ శాస్త్రం వంటి ఉన్నత విద్య కోసం భారతీయులంతా ఇంగ్లాండ్ వెళ్లేందుకు క్యూ కట్టిన ఆ రోజుల్లో అబిడ్ జర్మనీ వెళ్లాడు. దానివెనక ఆయన కుటుంబ జాతీయ భావాలున్నాయి.
అబిద్ అసలు పేరు జాయిన్ ఉల్ అబిడీన్ హసన్. ఆయన అబిద్ హసన్ గా, అబిద్ హసన్ శాఫ్రనీగా పేరుపొందారు. నిజానికి ముస్లింలలో శాఫ్రనీ అనే ఇంటిపేరు లేదు. హిందూ దేశభక్తికి సంకేతంగా ఆయన శాఫ్రన్ (కాషాయం) ని తన సర్ నేం గా మార్చకుని అబిద్ శాఫ్రనీ అయ్యారు.
1853-1883 మధ్య హైదరాబాద్ దీవాన్ గా సర్ సాలార్ జంగ్ 1 హైదరాబాద్ సంస్థానం లో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలనుకున్నారు. దీనికోసం ఆయన బ్రిటిష్ ఇండియా నుంచి ఎందరో ఇంగ్లీష్ చదువుకున్న నిపుణులను తీసుకువచ్చారు. ఇలా వచ్చిన వారిలో నవాబ్ మోషిన్ ఉల్ ముల్క్ ఒకరు. ఆయన సోదరుడు అమీర్ హసన్. ఆయన తర్వాత హైదరాబాద్ కలెక్టర్ అయ్యారు. ఆయన కుమారుడే అబిద్ హసన్. 1911లో ఆయన జన్మించారు. తల్లి ఇరానీ మహిళ. ఆమెకు బ్రిటిష్ వాళ్లంటే గిట్టేదికాదు. అందుకే తన పిల్లలను ఉన్నత చదువులకు ఇంగ్లాండు పంపడాన్ని ఆమె వ్యతిరేకించారు. జర్మనీకి పంపారు. ఇలా అబిద్ ఇంజనీరింగ్ చదువుకోసం జర్మనీ వెళ్లారు.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సుభాస్ చంద్రబోస్ జర్మనీకి తప్పించుకుని పోయారు. అక్కడి నుంచి ఆయన బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు. జర్మనీ బ్రిటిష్ తో తలపడుతూ ఉంది కాబట్టి, భారతీయుల్లో బ్రిటిష్ వ్యతిరేకత నూరిపోసేందుకు జర్మనీ బోస్ కు సహాయం చేస్తూ వచ్చింది.
జైహింద్ ఇలా వచ్చింది
జర్మనీకి చిక్కిన భారతీయ యుద్ధ ఖైదీలను ఉద్దేశించి బోస్ ప్రసంగించే వారు. వారంతా బ్రిటిష్ కు వ్యతిరేకంగా ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరాలని పిలుపు నిచ్చేవారు. ఇలాంటి ఒక సందర్భంలో అబిద్ నేతాజీని కలుసుకున్నారు. తన చదువు అయిపోగానే తాను కూడా దేశం కోసం ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరాతానని చెప్పారు. నేతాజీ ఆపుడాయన మీద ఒక చురక వేశారు. అటువైపు దేశ విముక్తి అజాద్ హింద్ ఫౌజ్ లో చేరాలని పిలుపు నిస్తుంటే ఇలాంటి అల్పవిషయాలు ప్రతిబంధకాలు కారాదు అన్నారు. అంతే, ఆయన చదువు వదిలేసేందుకు సిద్ధమయ్యారు. జర్మన్ భాష వస్తుంది కాబట్టి ఆయన అక్కడిక్కడే నేతాజీ సెక్రెటరీగా, అనువాదకుడిగా నియమితుడుయ్యాడు. అప్పటి నుంచి అబిద్ నేతాజీ వెంటే ఉన్నారు.నేతాజీతో కలసి సింగపూర్ జపాన్ లలో పర్యటించారు. అజాద్ హింద్ ఫౌజ్ లో అబిద్ ‘మేజర్’ అయ్యారు.
అజాద్ హింద్ ఫౌజ్ లో ఒకరికొకరు అభినందనలు చెప్పుకునేందుకు ఒక భారతీయ విధానంలో ఒక మాట ఉండాలని అనుకున్నారు. అదే బ్రిటిషర్లనుంచి విముక్తి పొందాక కూడా దేశాన్ని నడిపించాలన్నది కోరిక. దీనికి చాలా మందిని సూచనలు కోరారు. అబిద్ మొదట ‘హెల్లో’ అన్నారు. అంతా తోసిపుచ్చారు. తర్వాత ఆయన ‘జై హింద్ ’అన్నారు. నేతాజీ కి నచ్చింది. ఆ మరుసటి క్షణం నుంచి భారత జాతీయ ఉద్యమాన్ని నడిపించిందదే మాట. ఇపుడడి భారత దేశా జాతీయ నినాదం. నేతాజీ ఏర్పాటుచేసిన ప్రొవిజిన్ భారత ప్రభుత్వానికి జనగణమన జాతీయగీతాన్ని హిందీ,ఉర్దూలలో అనువదించి (Shubh, sukh chain ki barkha barse, bharat bhagya hai jaga) అందించింది కూడా అబిదే. ఈ గీతానికి రామ్ సింగ్ థాకూరీ సంగీతం సమకూర్చారు.
శాఫ్రనీ ఇంటి పేరు
నేతాజీ నాయకత్వంలోని అజాద్ హింద్ ఫౌజ్ లో అన్ని మతాల వాళ్లుండేవాళ్లు. వీళ్ల మధ్య అపుడపుడు గొడవలు కూడా జరగుతుండేవి. స్వాతంత్య్రం వచ్చాక భారతదేశపు జండా ఏ రంగులో ఉండాలనేది చర్చకు వచ్చినపుడు హిందూ ముస్లింల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తాయి. హిందువులు కాషాయం కావాలన్నారు. ముస్లింలు ఆకుపచ్చ రంగు కావాలని పట్టుబట్టారు. ఈ గొడవ ముదిరే పరిస్థితి వచ్చింది. అపుడు హిందువులు కాషాయం మీద పట్టు సడలించుకున్నారు. ఈ చర్యతో అబిద్ చలించి పోయారు. అందుకే హిందూ మతానికి ప్రతీక అయిన కాషాయం (శాఫ్రాన్) రంగుని ఆయన ఇంటిపేరు గా మార్చకున్నారు. అబిద్ శాఫ్రనీ అయ్యారు. అజాద్ హింద్ ఫౌజ్ పతనమయ్యాక అబిద్ అరెస్టయి సింగపూర్ జైల్లో ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆయన చనిపోయారనుకున్నారు. 1946లో ఐఎన్ ఎ కేసు విచారణల తర్వాత అబిద్ విడుదలయి హైదరాబాద్ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ముఠాతగాదాలు పడలేక రాజీనామా చేసి బెంగాల్ ల్యాంప్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. కరాచీలో పోస్టింగ్ వచ్చింది. భారత దేశానికి స్వాతంత్య్రం రావడం, దేశ విభజన జరగడంతో కరాచీ పాకిస్తాన్ లో భాగమయింది. శాఫ్రనీ హైదరాబాద్ తిరిగొచ్చారు. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం ఇండియన్ ఫారిన్ సర్వీస్ లోకి తీసుకుంది. చైనా, స్విజర్లాండ్, ఇరాక్, సిరియా, డెన్మార్క్ వంటి దేశాలలో దౌత్య వేత్తగా పనిచేసి 1969లో రిటైరయ్యారు.1984లో చనిపోయారు. నేతాజీ మేనల్లుడు అబిద్ మేనకోడలిని పెళ్లి చేసుకున్నారు.
నూరుకోట్ల జనం నోళ్ల నానుతున్న జైహింద్ నినాదం అందించిన ప్రభుత్వాలకుఅబిద్ పెద్దగా గుర్తు లేకపోవడం విచారకరం. ఆయన పేర తెలంగాణ హైదరాబాద్ లో కూడా ఏ కార్యక్రమం జరగ లేదు. ఆయన ఓట్లకు పనికొచ్చే రాజకీయ నాయకుడు కాకపోవడే శాపమేమో.
