తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజాజీవితంలో ఉన్నారు. దశాబ్దంన్నర కాలం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి, విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాలా మంది ప్రధానులు, ఒకరిద్దరు రాష్ట్రపతుల ఎంపిక విషయంలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించానని చెపుతూ ఉంటారు. సమర్ధవంతమైన నాయకునిగా, ముందు చూపు ఉన్న నేతగా తనకు తాను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేస్తూ ఉంటారు.
అయితే ఇలా చెప్పుకునే విషయాలకు, ఆయన చేసే రాజకీయ వ్యాఖ్యలకు ఎక్కడా పొంతన ఉన్నట్టు కనిపించదు. యావత్ దేశం, ఆమాటకొస్తే యావత్ ప్రపంచం కరోనా వ్యాధి తీవ్రతతో అల్లాడుతోంది. ప్రభుత్వాలు వైద్య యుద్ధం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై చేసే విమర్శలు చూసిన వారికి “ఇదేం అనుభవం” అనే అనుమానం కలగక మానదు.
దేశం అంతా లాక్ డౌన్ ప్రకటించిన ఈ కష్ట కాలంలో పక్క రాష్ట్రంలో తన ఇంటిలో క్షేమంగా కూర్చున్న చంద్రబాబు హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిరోజూ రాళ్ళు వేస్తూనే ఉన్నారు. రాజకీయం తగదు అంటూనే పూర్తిరాజకీయం చేస్తున్నారు. ఆయన ఉపయోగించే భాష, ఆయన పల్లకీ మోసే మీడియా ఉపయోగిస్తున్న బాష చూసిన వారు ఇదేం రాజకీయం అని ముక్కున వేలు వేసుకునేలా చేస్తున్నారు.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వంపై రెండు ప్రధాన ఆరోపణలు చేశారు. కరోనా టెస్టు కిట్టుల్లో ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడిందని, అధికార పార్టీ శాసనసభ్యుడి కారణంగానే కర్నూలులో కరోనా విజృంభించిందని చంద్రబాబు చేసిన తాజా విమర్శలు. ఈ విమర్శలపై ప్రభుత్వం, అధికార పార్టీ ఇప్పటికే స్పష్టమైన వివరణ ఇచ్చాయి. అయినా ఆయన తన రాజకీయ విమర్శలు ఆపుకోరు. అనుభవజ్ఞుడైన నాయకుడిని 23 స్థానాలకు పరిమితం చేసి ఏమాత్రం అనుభవం లేని జగన్ మోహన్ రెడ్డికి 151 స్థానాల భారీ ఆధిక్యతతో పట్టం కట్టిన ప్రజలు నవ్వుతారన్న స్పృహ కూడా లేకుండా ప్రతిరోజూ రాజకీయం చేస్తున్నారు.
ఈ తాజా ఆరోపణలతో పాటు కరోనాపై ప్రభుత్వం సలహాలు, సూచనలు తీసుకోవాలని, అందుకోసం అఖిల పక్షం ఏర్పాటు చేయాలనీ చంద్రబాబు నాయుడు తాజాగా డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చెంద్రబాబు అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ఒక్క నిర్ణయంలో కూడా ప్రతిపక్షాల అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేయలేదు.
మొదటి నిర్ణయం: పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా ఉండవలసిన హైదరాబాద్ ను కాదని మొదటి సంవత్సరంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని విజయవాడకు తరలించారు. ఈ నిర్ణయం ఐదున్నర కోట్ల ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం అయినప్పటికీ, ఆయన అర్ధరాత్రి హడావుడిగా ఉమ్మడి రాజధాని వదిలేశారు. ఈ నిర్ణయంలో ఎప్పుడు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు? ఏ రాజకీయ పార్టీని సంప్రదించారు?
రెండో నిర్ణయం: ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వదులుకున్నాక, నూతన రాజధానిగా బహుళ పంటలు పండే తుళ్ళూరు, తాడేపల్లి మరియు మంగళగిరి మండలాల్లో 29 గ్రామాలను ఎంపిక చేశారు. రాష్ట్ర రాజధాని మొత్తం ఐదున్నర కోట్ల ప్రజలకు సంబంధించిన విషయం. ఈ విషయంలో ఏ ప్రతిపక్షాన్ని చంద్రబాబు సంప్రదించారో చెప్పాల్సి ఉంది. ఈ రాజధాని విషయంలో ఎన్నిసార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహించారో చంద్రబాబు చెప్పాలి.
మూడో నిర్ణయం: రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రం పారిశ్రామికంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందుతుందని విభజన సమయంలో పెద్దలు నిర్ణయించారు. అయితే ప్రత్యేక హోదా అంశాన్ని ఆయన వదిలేసి ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారు. హోదా హామీపై నిర్ణయం మార్చుకున్న చంద్రబాబు ఏ ప్రతిపక్ష పార్టీతో సంప్రదించి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలి. ఐదున్నర కోట్ల ప్రజలకు సంబంధించిన అంశంపై నిర్ణయం తీసుకున్నప్పుడు కనీసం రాష్ట్రంలో ఎవరితోనైనా చర్చించారా? ఎవరి అభిప్రాయం అయినా తీసుకున్నారా అనేవిషయం చంద్రబాబు చెప్పాలి.
ఇలా రాస్తూపోతే చంద్రబాబు ప్రజాస్వామ్య బద్దంగా పనిచేయలేదు అని చెప్పడానికి చాలా పేజీలు కావలసి వస్తుంది. కానీ అవన్నీ మర్చిపోయి ఇప్పుడు తాజాగా అఖిలపక్షం ఏర్పాటు చేయాలనీ రాజకీయ డిమాండ్లు ముందుకు తేవడం చంద్రబాబు తెంపరితనమో లేక అవకాశవాద రాజకీయమో ప్రజలు చర్చ చేస్తున్నారు.
