ప్రజెంట్ తెలుగుదేశం పార్టీలో రెండు ప్రధాన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఒకటి వరుస అరెస్టులతో విరుచుకుపడుతున్న అధికార పక్షం నుండి తమని తాము కాపాడుకోవడం. అలాగే వారసుడిని సిద్దం చేయడం.. అదే నారా లోకేష్ను షేప్ అప్ చేయడం. ఇన్నాళ్ళు లోకేష్ చాలా వరకు చంద్రబాబు మాటునే మనుగడ సాగిస్తూ వచ్చారు. 2014 ముందు వరకు పార్టీ అంతర్గత కలాపాల్లో మాత్రమే పాలుపంచుకున్న లోకేష్ ఎన్నికల్లో విజయం అనంతరం పూర్తిస్థాయి రాజకీయ వేదిక మీదకి వచ్చేశారు. చంద్రబాబు కూడా అన్ని విధాలా కుమారుడిని రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేశారు.
ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకునే స్వేచ్చను కూడా ఇచ్చారు. అప్పుడంటే అధికారం చంద్రబాబు చేతిలో ఉంది కాబట్టి లోకేష్కు అన్నీ అలవోకగా కలిసొచ్చాయి. కానీ 2019 ఎన్నికల్లో ఘోర ఓటమితో తెలుగుదేశం అన్ని విధాలా కుంగిపోయింది. స్వయానా చంద్రబాబే చేష్టలుడిగి చూడాల్సిన పరిస్థితి. దాంతో లోకేష్ సైతం ప్రోత్సాహం లేక సైలెంట్ అయిపోయారు. గతేడాది మొత్తం ఆయన ట్విట్టర్ పోరుకే పరిమితమయ్యారు.
తాజాగా టీడీపీ కీలక నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిలు అరెస్ట్ కావడంతో టీడీపీలో పెద్ద కుదుపు ఏర్పడింది. ఎవరికివారు స్వీయ రక్షణలో పడ్డారు. ఒక రకంగా ఇది సంక్షోభమనే అనుకోవాలి. కానీ కష్టాల్లో కూడా అవకాశాలు వెతుక్కునేవాడే పైకి లేచి నిలబడగలడు అనే సిద్దాంతాన్ని బాబుగారు బాగా నమ్ముతారు. గతంలో పలుసార్లు ఈ సిద్దాంతాన్ని ఫాలో అయ్యారు కూడ. ఇప్పుడు అదే ఫార్ములాను కొడుకు లోకేష్కు అప్లై చేస్తున్నారు బాబుగారు. ఈ కష్టకాలంలో పోరాడితేనే మంచి గుర్తింపు వస్తుందని ప్రధాన కార్యకలాపాలకు లోకేష్ను ముందుంచుతున్నారు.
మొన్నామధ్యన వైసీపీ సంవత్సర కాలం పాలన మీద ప్రెస్ మీట్ పెట్టి ఛార్జ్ షీట్ తరహాలో పెద్ద తప్పుల చిట్టాను లోకేష్ చేతుల మీదుగానే రిలీజ్ చేయించారు. అలాగే అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి అనంతపురానికి లోకేషే వెళ్లారు. ప్రధాన ప్రెస్ మీట్లలో కూడా ఆయనే పాల్గొంటున్నారు. ఈ విధంగా చంద్రబాబు లోకేష్ను నాయకుడిగా సానబట్టడానికి, సంక్షోభాల్లో ఎలా నిలబడాలో నేర్పడానికి అతన్ని రాజకీయాల్లోకి పూర్తిగా ముంచేశారు.
