ప్రియాంక గాంధీకి షాక్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే 

ఎవరైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు సొంత పార్టీ అధిష్టానం ఏదైనా కార్యక్రమం చేస్తే దాన్ని ప్రమోట్ చేయడానికి చాలా ట్రై చేస్తారు.  ఇక కాంగ్రెస్ లాంటి జాతీయ స్థాయి పార్టీలో ఈ పోకడ మరీ ఎక్కువ.  ఈ కరోనా కష్ట కాలంలో జనానికి సహాయం చేసి మంచి పేరు తెచ్చుకుందామని కాంగ్రెస్ పార్టీ అనుకుంది.  అందుకోసం వలస కార్మికులను ఎంచుకుంది.  వలస కూలీలు లాక్డౌన్ నేపథ్యంలో అనేక రాష్ట్రాల నుండి సొంత ప్రాంతాలకు కాలి నడకన వెళ్తున్నారు.  కేంద్రం మొదట్లో వారి గురించి పెద్దగా పెట్టించుకోలేదు. 
 
దీన్ని లెవనెత్తిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వలస కూలీలను బీజేపీ పట్టించుకోవడంలేదు. అందుకే మేమే నేరుగా వారి కోసం 1000 బస్సులను నడుపుతాం అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.  ఈ పనిని వారసురాలు ప్రియాంక గాంధీకి అప్పగించారు.  అనుకున్నట్టే వెయ్యి వాహనాలను రెడీ చేసి పలు రాష్ట్రాల సరిహద్దులకు పంపారు.  కానీ వాటిలో చాలా బస్సుల రిజిస్ట్రేషన్ నెంబర్లు సరిగా లేవనే ఆరోపణలు మొదలయ్యాయి.  బయటి నుండి ఇలాంటి విమర్శలు కామన్ కాబట్టి కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోకుండా పనులు చేసుకుంటూ వెళ్లారు. 
 
కానీ సొంత పార్టీ ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్ పెద్దలకు షాకిస్తూ విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు.  యూపీలోని పాపులర్ నియోజకవర్గాల్లో ఒకటి, సోనియా గాంధీ కుటుంబానికి పెట్టని కోట రాయ్ బరేలి ఎమ్మెల్యే అతిధి సింగ్ కాంగ్రెస్ చర్గలపై దుమ్మెత్తిపోశారు.  గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితమైన అతిధి సింగ్ కొన్నాళ్ళుగా కాంగ్రెస్ అధిష్టానం మీద విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.  
 
ఆమె ఇంతటి విపత్కర పరిస్థితుల్లో అంత నీచ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది? వెయ్యి బస్సులు వలస కూలీల సౌకర్యార్థం పంపుతున్నామని చెప్పారు.  వాటిలో సగం నెంబర్లు తప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్లు, కొన్నిటికి అసలు పేపర్లే లేవు.  బస్సులే ఉంటే రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్రలకు ఎందుకు పంపలేదు.  ఇంత దారుణమైన జోకులు ఎలా వేస్తున్నారు.  యూపీ విద్యార్థులు రాజస్థాన్లో చిక్కుకుపోయినప్పుడు మీ బస్సులు ఏమయ్యాయి.  వారిని కాంగ్రెస్ బస్సులు సరిహద్దుల వద్ద వదిలేస్తే యోగీ సర్కార్ ఇళ్లకు చేర్చింది అంయూ ప్రశ్నల వర్షం కురిపించారు.  దీంతో ప్రియాంక గాంధీకి గట్టి షాక్ తగిలినట్టైంది.