రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ విరామం తర్వాత దేశ రాజధాని హస్తినకు వెళుతున్నారు. ఒక్కరోజు పర్యటనలో ఆయన దేశ హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. ఇంకా కొందరు కేంద్ర మంత్రులతో కూడా ఆయన సమాలోచనలు చేయనున్నారు. ఈ పర్యటన ఎందుకో రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కానీ పూర్తి సమాచారం లేదు. సమగ్ర సమాచారం లేనప్పుడు ఎవరికి తోచింది వారు చెప్పుకోవడమే ఆనవాయితీ కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎవరికి నచ్చిన ఎజెండా వారు ఇచ్చేస్తున్నారు.
గత కొన్ని నెలలుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. ప్రధానంగా రాష్ట్ర హై కోర్టు ప్రభుత్వ నిర్ణయాలను కొట్టివేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే హై కోర్టు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలు, ఉత్తర్వులను రద్దు చేస్తూ ప్రభుత్వానికి కొంత తలనొప్పిగానే తయారయింది. కేంద్ర న్యాయశాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పినట్టు కొందరు ఎన్నికల్లో ఓటమి చెందిన రాజకీయ నాయకులు కోర్టుల ద్వారా ప్రభుత్వాలకు చికాకులు పుట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా భావిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోర్టుల ద్వారా ప్రభుత్వాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గ సహచరులతో పాటు అధికశాతం ప్రజలు కూడా గట్టిగా నమ్ముతున్నారు.
గత ఆగస్టు నెల నుండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను, విడుదల చేసిన అనేక ఉత్తర్వులను రాష్ట్ర హై కోర్టు కొట్టివేసింది. ఇంగ్లీష్ మీడియం, ప్రభుత్వ భూముల విక్రయం, ఎన్నికల కమిషనర్ మార్పు వంటి నిర్ణయాలను కొట్టివేసి హై కోర్టు ప్రభుత్వానికి గుదిబండలా మారింది. చివరికి ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ విషయంలో కూడా హై కోర్టు అనవసర జోక్యం చేసుకుందని, కొంచెం అతిగా స్పందించిందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే గ్రామా సచివాలయ భవనాలకు రంగుల విషయంలో కూడా కోర్టు అతిగానే స్పందించిందని ప్రభుత్వం భావిస్తోంది.
కరోనా కష్ట కాలంలో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసే విషయంలో కూడా హై కోర్టు ఏకపక్షంగానే వ్యవహరించిందని ప్రజలు నమ్ముతున్నారు. ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన అధికార పార్టీ శాసనసభ్యులపై హై కోర్టు కేసులు నమోదు చేసింది. శాసన సభ్యులు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని తీవ్ర అభ్యంతరం తెలిపింది. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ నుండి ఉండవల్లికి భారీ ర్యాలీతో వచ్చినా హై కోర్టు స్పందించలేదు. స్పందించమని అభ్యర్థిస్తూ వచ్చిన ఫిర్యాదుదారులకు సంబంధిత పోలీసు అధికారులనో లేక పోలీస్ స్టేషన్ లోనో ఫిర్యాదు చేయమని ఉచిత సలహా ఇచ్చింది.
కోర్టు స్పందిస్తున్న తీరు, కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేస్తున్న వ్యక్తులు, న్యాయవాదుల జాబితా చూస్తే కేంద్ర న్యాయశాఖా మంత్రి అభిప్రాయం నిజమే అని చెప్పక తప్పదు. ఫిర్యాదు దారులు, న్యాయవాదులు చంద్రబాబుకు అనుచరులుగానో లేక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు గానో గుర్తింపు ఉన్నవారే.
ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పయనం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర హోమ్ మంత్రితో భేటీలో రాష్ట్రంలో హై కోర్టు తీరు పట్ల ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రస్తావన తెచ్చే అవకాశం ఉంది అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హై కోర్టులోని ఒకరిద్దరు న్యాయమూర్తులను మార్పు చేసేందుకు కూడా ముఖ్యమంత్రి కేంద్ర హోమ్ మంత్రిని కోరవచ్చని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో హై కోర్టు తీరు మారకపోతే ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదని, పైగా ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్దికోసం హై కోర్టును ఉపయోగించుకుంటున్నారని అమిత్ షాకు జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేయనున్నారని సూచనలు అందుతున్నాయి. ఈ ఫిర్యాదుతో పాటు రాష్ట్రానికి రావలసిన నిధుల గురించి కూడా ముఖ్యమంత్రి ఈ పర్యటనలో ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది.
