పంచ ప్రాణాలు అనగా ఏమిటి?

ప్రాణాపాన సమాఘతాత్ కందమధ్యాద్యదుత్థితం |
ప్రాణలింగం తదాఖ్యాతం ప్రాణాపాననిరోదిభిః ||
ప్రతి మానవుని దేహంలో ఐదు రకముల వాయువులుంటాయి: 1. ప్రాణం, 2. అపానం,
3. సమానం, 4. ఉదానం, 5. వ్యానం. వీటిని పంచప్రాణాలని పిలుస్తారు.
హృది ప్రాణోగుదేపానః సమానోనాభిమండలే |
ఉదానః కంఠ దేశేస్యాద్ వ్యానః సర్వశరీరగః ||

what is pancha pranalu
what is pancha pranalu

ప్రాణవాయువు హృదయంలో, అపానవాయువు మూలాధారంలో, సమానవాయువు నాభిలో, ఉదానవాయువు కఠంలో, అలాగే వ్యానవాయువు దేహమంతా నెలకొని ఉంటుంది.
నిజానికి వాయువు ఒకటే అయినా, పలు ప్రదేశాలలో పలు పనులతో పలు పేర్లను కలిగి ఉంటుంది.
ప్రాణవాయువు హృదయం నుండి నాసిక (ముక్కు) వరకు సంచరిస్తుంది. ఈ సంచారం రోజుకు 21600 సార్లు ఉచ్ఛ్వాస-నిశ్వాసాల ద్వారా జరుగుతుంది. ఈ ప్రాణవాయువు సంచారంతోనే శరీరం జీవించి ఉంటుంది లేకపోతే అన్ని క్రియలు ఆగిపోయి, మనషి మరణిస్తాడు. ఈ ప్రాణవాయువు ఊర్థ్వముఖం (పైకి) గా ప్రయాణిస్తుంది. గుద (పీఠ) స్థానంలో నెలకొన్న అపానవాయువు మలమూత్రములను బయటకు పంపే పనిని చేస్తుంది. ఇది అధోముఖంగా (క్రిందకు) ప్రయాణిస్తుంది. నాభి (బొడ్డు)లో ఉండే సమాన వాయువు మనిషి తిన్న అన్నం యొక్క రసమైన రక్తాన్ని అన్ని అవయవములకు వాటి పనులను మరియు స్థాయిని బట్టి సమానంగా పంచుతుంది.
ఉదానవాయువు కంఠ భాగంలో ఉండి చీమిడి, కళ్ళి వంటి వాటిని దేహంలోపలి నుంచి బయటకు పంపే పని చేస్తుంది. వ్యానవాయువు శరీరంలోని ప్రతినాడిలో సంచరించి రక్తప్రసరణ ప్రక్రియను సమతుల్యంగా చేసి కాపాడుతుంది, లేకపోతే పక్షవాతం వంటి రోగాలు శరీరంలోకి చేరుతాయి. ఇది మనపూర్వీకులు, పెద్దలు, పండితులు ఆయా సందర్భాలలో చెప్పిన విషయం.