ఆరు నెలలు మాత్రమే పూజలు అందుకొనే సంగమేశ్వరుడి దర్శనం.. సకల పాప హరణం!

కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా కొత్తపల్లి మండలం పరిసర ప్రాంతాల్లో కొలువై ఉన్న సంగమేశ్వర స్వామి ఆలయం సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. ఎందుకంటే శ్రీశైలం డాం పూర్తిగా నిండినపుడు ఆడాం వెనుక జలాల వల్ల ఈ ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉంటుంది. కేవలం కొన్ని నెలలు మాత్రమే ఈ ఆలయంలో సంగమేశ్వర స్వామి పూజలు అందుకుంటాడు. మిగిలిన కాలంలో ఆలయం మొత్తం కృష్ణమ్మ ఒడిలోకి వెళ్ళిపోతుంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం వెనుక జలాలు తగ్గుముఖం పట్టడంతో ఈ ఆలయం బయటపడింది. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఆలయం మొత్తాన్ని శుభ్రం చేశారు.

కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఈ పురాతన ఆలయంలో ధర్మరాజు వేపదారు లింగం ప్రతిష్టించినట్లు తెలుస్తోంది. ఎంతో మహిమగల ఈ ఆలయం బుధవారం భక్తులకు దర్శనమిచ్చింది. సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే సంగమేశ్వరుడు దర్శన భాగ్యం లభిస్తుందడంతో ఈ దేవాలయ సందర్శనకు భక్తులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ బుధవారం భీష్మ ఏకాదశి సందర్భంగా లలితా దేవి సమేత సంగమేశ్వర స్వామి, వినాయకుడు తదితర దేవతా మూర్తులు చాలాకాలం తర్వాత ఆలయంలో తొలి పూజ అందుకున్నారు. సప్త నదుల సంగమ ప్రాంతంలో ఉండే ఈ సంగమేశ్వర దేవాలయం పూర్తిగా ఆరు నెలలు నీటిలో మునిగిపోయి ఉంటుంది. మిగిలిన ఆరు నెలలు మాత్రమే ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తారు.

ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయ ముఖ మండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం గర్భాలయాలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తున్నాయి. ఈ ధర్మాలయంలో సంగమేశ్వర స్వామి పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది. కోరిన కోరికలు నెరవేర్చే సంగమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వస్తారు. ఈ ఏడాది శ్రీశైలం నీటిమట్టం త్వరగా తగ్గడంతో సంగమేశ్వరుడి దర్శన భాగ్యం త్వరగా లభించిందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయాన్ని దర్శించడానికి దూర ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తున్నారు.