ప్రియుడి కోసం.. కాబోయే భర్తను చంపించిన యువతి..!!

పెద్దలు కుదిర్చిన సంబంధం ఆ యువతికి ఇష్టం లేదు. తానో వ్యక్తిని ప్రేమించింది. ఈ విషయం ఇంట్లోనూ, ఆ అబ్బాయికి చెప్తే బాగుండేది. కానీ.. తన ప్రేమ విషయం ఎవరికీ చెప్పలేదు. ప్రేమించిన వ్యక్తి కోసం పెద్దలు చూసిన వ్యక్తిని పార్టీకి పిలిచి ప్రియుడితో కలిసి చంపించేసింది. దారుణమైన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. పోలీసుల విచారణలో వెల్లడైన ఈ దారుణమైన సంఘటనా వివరాలు..

ఉత్తరప్రదేశ్ లోని మోహనాలాల్‌గంజ్ కు చెందిన ఓ యువతి అదే ప్రాంతానికి చెందిన షానే అలీ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కానీ.. యువతి కుటుంబ సభ్యులు బంత్ర ప్రాంతానికి చెందిన షాబుద్దీన్‌తో వివాహం నిశ్చయించారు. అయితే.. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఆ యువతికి ఇష్టం లేదు. ప్రియుడంటే ఉన్న ఇష్టాన్ని చంపుకోలేక పెద్దలు కుదిర్చిన యువకుడినే చంపేయాలని ప్రియుడు షానే ఆలీతో కలిసి పథకం వేసింది.

తన బర్త్ డే రోజునే షాబుద్దీన్ ను చంపాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తన పుట్టినరోజు మార్చి 11న వేడుకలకు షాబుద్దీన్ ను పిలిచింది. పార్టీకి వెళ్లిన షాబుద్దీన్ కు పథకం ప్రకారం ఫూటుగా మద్యం తాగించారు. షాబుద్దీన్ పూర్తిగా మత్తులో ఉన్నాడు. ఇదే అదనుగా షానే అలీ తన మిత్రులతో కలిసి షాబుద్దీన్ ను కత్తులతో పొడిచి, కుక్క బెల్ట్‌ను మెడకు బిగించి హత్య చేశారు. అనంతరం షాబుద్దీన్ మృతదేహాన్ని బాబుఎర గ్రామంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. అయితే.. పార్టీకి వెళ్లిన షాబుద్దీన్ ఎంతకీ రాకపోవడంతో అతడి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన కుమారుడు తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు యువతిపై అనుమానం వచ్చింది. విచారించగా తనకేమీ తెలీదని చెప్పింది. కానీ.. పోలీసులకు వచ్చిన అనుమానంతో యువతి ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. విచారణలో ఆమెకు ప్రియుడు ఉన్నాడని తేలింది. దీంతో తమదైన శైలిలో విచారించగా ఆ యువతి అసలు విషయం చెప్పింది. షాబుద్దీన్ తామే చంపినట్టు అంగీకరించింది. దీంతో యువతి ఆమె ప్రియుడిపై మర్డర్ కేసు నమోదు చేసారు. మరో ఆరుగురిని అరెస్టు చేశారు.