తిరుమల గురించి చాలమందికి తెలియని విషయం…

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దర్భ సిద్ధం… దర్భ ప్రాశస్త్యం ఏమిటి?

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆగమోక్తంగా నిర్వహించే ధ్వజారోహణం కార్యక్రమం కోసం టిటిడి అటవీ విభాగం ఆధ్వర్యంలో పవిత్రమైన దర్భను సిద్ధం చేశారు. దర్భతో తయారుచేసిన చాప, తాడును సోమవారం టిటిడి డిఎఫ్‌వో శ్రీ డి.ఫణికుమార్‌నాయుడు ఆధ్వర్యంలో అటవీ విభాగం అధికారులు, సిబ్బంది ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీవారి ఆలయ పేష్కార్‌ శ్రీ రమేష్‌బాబుకు అందించారు.

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించే కైంకర్యాలు, సేవలు, హోమాల్లో దర్భను వినియోగిస్తారు. ఈ దర్భను తిరుమలలోని కల్యాణవేదిక ఎదురుగా గల టిటిడి అటవీ విభాగం నర్సరీల్లో పండిస్తారు. బ్రహ్మోత్సవాల కోసం బాగా పెరిగిన దర్భ అవసరమవుతుంది. ఈ దర్భను తిరుపతి సమీపంలోని పాపానాయుడుపేట, చెల్లూరులోని వ్యవసాయ పొలాల గట్ల నుండి సేకరించారు. ఈ దర్భను సేకరించిన తరువాత 15 రోజుల పాటు నీడలో ఆరబెడతారు. ఈ దర్భతో 6.5 మీటర్ల పొడవు, 5 మీటర్ల ఎత్తుతో చాపను, 200 మీటర్ల తాడును తయారుచేస్తారు. దీనికోసం 10 రోజుల సమయం పడుతుంది. ధ్వజారోహణం సందర్భంగా ధ్వజస్తంభానికి ఈ చాపను, తాడును చుడతారు.