మద్యం మత్తులో కట్టుకున్న భార్యని కడతేర్చిన భర్త.. ఎందుకు చంపాడో తెలిస్తే షాక్?

మూడుముళ్ల బంధంతో ఒక్కటైన భార్యాభర్తలు కష్టసుఖాలను పంచుకుంటూ జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన వారు చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పడుతూ ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. చిన్న చిన్న మనస్పర్ధలు కారణంగా చాలామంది భార్య భర్తలు విడాకులు తీసుకుంటుంటే మరి కొంత మంది మాత్రం ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే మరికొంతమంది దారుణాలకు పాల్పడి హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. ప్రతిరోజు ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ప్రకాశం జిల్లాలో కూడా ఇటువంటి దారుణ ఘటన చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళితే…ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమ్మన పల్లె చెంచు కాలనీలో అంకాలు అనే వ్యక్తి భార్యతో కలసి జీవనం సాగిస్తున్నాడు. అంకాలుకి మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలో రోజు మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. అయితే అంకాలు ఇలా ప్రతి రోజూ మద్యం సేవించటం అతని భార్యకు నచ్చేది కాదు. దీంతో తరచు వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఇటీవల అంకాలు మళ్లీ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో అతని భార్య భోజనం పెట్టకుండా నిద్రపోయింది.

అయితే తనకు భోజనం పెట్టలేదన్న కోపంతో తీవ్ర ఆవేశానికి గురై భార్య గర్భవతి అన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆమె మీద కర్రతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో అంకాలు భార్య తీవ్ర గాయాలతో మృతి చెందింది. ఈ సంఘటన గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి బాధితురాలు భర్తని అదుపులోకి తీసుకొని విచారించగా మద్యం మత్తులో అన్నం పెట్టలేదన్న కోపంతో తన భార్యను హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు అంకాలుని అదుపులోకి తీసుకున్నారు.