12 ఏళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసి గోనెసంచిలో దాచిపెట్టిన తండ్రి…. ఎందుకంటే?

ప్రస్తుత కాలంలో చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. ఈ గొడవల కారణంగా కుటుంబ సభ్యుల మీద ప్రభావం పడుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల మధ్య వచ్చే గొడవల వల్ల పిల్లలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరికొంతమంది దంపతులు ఒకరి మీద ఒకరికి ఉన్న కోపంతో పిల్లలని హతమార్చడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా ముంబైలో కూడా ఇటువంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది. భార్య మీద ఉన్న కోపంతో 12 ఏళ్ల కుమారుడిని తండ్రి దారుణంగా హత్య చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని పారవేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పట్టుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు…ఆనంద్ గణేశన్‌గా అనే తన భార్యతో గొడవ పడి కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలిద్దరూ తల్లితోనే కలిసి ఉంటున్నారు. పిల్లలను కలిసేందుకు గణేశన్‌ తరచూ వస్తుండేవాడు .అలా వచ్చిన ప్రతిసారి భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే బుధవారం ఆనంద్ తన 12 ఏళ్ల కుమారుడు ఆకాష్‌ను ఎవరికీ చెప్పకుండా అంబర్‌నాథ్‌లోని తన ఇంటికి తీసుకెళ్లాడు. భార్య మీద ఉన్న కోపంతో ఆకాష్‌ను పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేశాడు.

ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా కుమారుడు మృతదేహాన్ని గోన సంచిలో పెట్టి మృతదేహాన్ని తప్పించేందుకు ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆనంద్ గణేశన్ తన కుమారుడి మృతదేహాన్ని రైల్వే ట్రాక్ సమీపంలోని డ్రెయిన్‌లో పడేసేందుకు గోనె సంచిలో తీసుకెళ్తున్నాడు. అయితే గణేశన్ ప్రవర్తన చూసి అనుమానం వచ్చిన స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గణేషన్ ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.