భార్య ఉద్యోగం చేస్తుందని ఆ భర్త చేసిన పని తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే?

ప్రస్తుత కాలంలో పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాలలో సమానంగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది మహిళలు వివాహం తర్వాత కూడా ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా భర్తకు సహాయం చేస్తున్నారు. కొంతమంది మహిళల్ని వివాహం తర్వాత ఉద్యోగానికి పంపటానికి అత్తింటి వారికి ఇష్టం ఉండదు. ఇలా భార్య ఉద్యోగం చేయటం భర్తకి ఇష్టం లేక కొందరు ఉద్యోగాలు మానిపిస్తుంటే.. మరికొందరు మాత్రం ఉద్యోగం పేరుతో భార్యలకు అక్రమ సంబంధాలు అంటగట్టి హత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల బీహార్ లో కూడా ఇటువంటి విషాద ఘటన చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే…బిహార్‌లోని, బెగుసరై ప్రాంతంలో సీతాదేవి మహేష్ రామ్ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక పాప. సీతాదేవి గ్రామంలోని ఉద్యోగ విహార్‌లో ఉన్న ఒక గార్మెంట్ పరిశ్రమలో పని చేస్తోంది. పెళ్లయిన కొంతకాలం నుండి ఇద్దరు మధ్య మనస్పర్ధలు రావడంతో భార్య ఉద్యోగం చేయడం ఇష్టం లేక మహేష్ రామ్ తరచు ఆమెను వేధించేవాడు. అంతేకాకుండా ఉద్యోగం మానేయమని భార్యను వేధించేవాడు. అయితే ఉద్యోగం మానేయటం ఇష్టం లేక భర్త పెట్టే వేధింపులు భరించలేక సీతాదేవి సంవత్సరం కాలంగా భర్త కి దూరంగా ఉంటుంది.

ఈ క్రమంలో శుక్రవారం సీతాదేవిని కలిసిన మహేష్ రామ్ తనతో కలిసి ఉండమని చెప్పి ఉద్యోగం మానేయమని కోరాడు. అయితే సీతాదేవి అందుకు నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన మహేష్ రామ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో సీతాదేవి మీద దాడి చేశాడు. దీంతో గాయాల పాలైన సీతాదేవి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకోగానే మహేష్ అక్కడి నుండి పరారయ్యాడు. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సీతాదేవి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.