తెలంగాణ గడ్డ మీద కాలు పెట్టిన పరిపూర్ణానంద (వీడియోలు)

 

ఆయన హిందూ సమాజంలో పేరుమోసిన స్వామీజి. ఎంతగా పేరుమోసిన స్వామివారు అంటే ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ సైతం ఆయనకు పాదాభివందనం చేశారు. అంతటి స్వామీజిని ఉన్నఫలంగా తెలంగాణ సర్కారు హైదరాబాద్ నగర్ బహిష్కరణ చేసింది. పోలీసులు బలవంతంగా స్వామీజిని నిర్బంధించి తెలంగాణ బార్డర్ దాటించారు. ఆయన ఎవరో కాదు స్వామి పరిపూర్ణానంద.

ఆయన ధర్మపరిరక్షణ కోసం హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఆ సమయంలోనే సినీ నటుడు కత్తి మహేష్ రాముడు, సీత, రావణుడు విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పట్లో పెద్ద దుమారం రేగింది. అప్పుడు కత్తి మహేష్ ను నగర బహిష్కరణ చేశారు పోలీసులు. ఆయనను అదుపులోకి తీసుకుని రాయలసీమకు తరలించారు.

అయితే కత్తి మహేష్ ఒక్కడినే నగర బహిష్కరణ చేస్తే విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో స్వామీ పరిపూర్ణానంద ను కూడా నగర బహిష్కరణ చేసి విజయవాడ తరలించారు తెలంగాణ పోలీసులు. స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణపై హిందూ ధార్మిక సంఘాలు కోర్టు మెట్లెక్కాయి. కోర్టు సర్కారు తీరును తప్పు పట్టింది. నగర బహిష్కరణ నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఆదేశాలిచ్చింది.

దీంతో మంగళవారం విజయవాడ నుంచి స్వామి పరిపూర్ణానంద హైదరబాద్ చేరుకున్నారు. విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకుని నేరుగా హైదరాబాద్ వచ్చారు. ఆయన హిందూ ధార్మిక సంస్థలు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీ స్వాగతం పలికారు. ఆ సమయంలో పోలీసులు పెద్ద సంఖ్యలో మొహరించారు. స్వామీజికి స్వాగత ర్యాలీ చేపట్టేందుకు ప్రయత్నిస్తున్న వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్వాగత ర్యాలీలో పాల్గొనడంతో పోలీసులు వెనకడుగు వేశారు. తర్వాత ర్యాలీ జరిగింది.  వీడియోలు పైన ఉన్నాయి చూడొచ్చు.