పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మిర్యాలగూడ అమృత ప్రణయ్

మిర్యాలగూడ అమృత జనవరి23న మగ బిడ్డకు జన్మనిచ్చింది. మిర్యాలగూడలో ప్రణయ్ హత్య ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచిపోయింది. అమృత, ప్రణయ్ ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అది ఇష్టం లేని అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకులతో ప్రణయ్ ని సెప్టెంబర్ లో హత్య చేయించాడు. అప్పుడు అమృత 5 నెలల గర్భిణి. ఆ తర్వాత అమృత తన తల్లిగారింటికి వెళ్లకుండా ప్రణయ్ ఇంట్లోనే ఉంటోంది. ఇప్పుడు అమృత మిర్యాలగూడలోని ఓ హస్పిటల్ లో ప్రసవించింది. ఆమెకు మగబిడ్డ పుట్టాడు. పుట్టిన కొడుకులో ప్రణయ్ ని చూసుకుంటానని ఉద్వేగంతో అమృత బంధువులతో అన్నట్టు తెలుస్తోంది. 

ప్రణయ్ హత్య తర్వాత ఆ కేసు పలు మలుపులు తిరిగింది. అమృత వైశ్య సామాజిక వర్గానికి చెందిన యువతి కాగా ప్రణయ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడు. దీనిని సహించని మారుతీరావు దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు నిందితులందరిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. తన తండ్రి ఇంటికి వెళ్లేది లేదని తాను ప్రణయ్ హంతకులకు శిక్ష పడే వరకు పోరాడుతానని తెలిపింది. నేతలు, నాయకులు అనేక సంఘాల వారు అమృతను ఓదార్చి పలు హామీలిచ్చారు. 

ప్రణయ్ హత్య తర్వాత సోషల్ మీడియాలో అమృత ప్రణయ్ లకు వ్యతిరేకంగా పలు కామెంట్లు వచ్చాయి. 9 వ తరగతిలేం ప్రేమ అని కొందరు, మారుతీరావు చేసింది కరెక్టే అని కొందరు కామెంట్లు చేశారు. ప్రభుత్వం అమృతకు ప్రభుత్వ ఉద్యోగం, 14 లక్షల రూపాయలు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, 3 ఎకరాల భూమి ఇస్తామని హామీనిచ్చింది. అలాగే మరికొందరు ప్రణయ్ విగ్రహాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు. 

 ప్రణయ్ ఇంటి చుట్టు పలుసార్లు అనుమానాస్పద వ్యక్తులు రెక్కి నిర్వహించడంతో అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి అమృతకు రక్షణగా ఇద్దరు పోలీసులు ఉంటున్నారు. తాజాగా అమృతకు కొడుకు పుట్టడంతో పోలీసులు మరింత భద్రత పెంచారు. పుట్టిన అబ్బాయికి ఏమైనా హాని తలపెట్టే అవకాశం ఉందని ప్రణయ్ తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. భద్రత కారణాల దృష్ట్యా అమృతకు పుట్టిన కొడుకు ఫోటోలు బయటికి రిలీజ్ చేయలేదు. అబ్బాయి పుట్టడంతో అమృత ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యారని ప్రణయ్ ని తలుచుకొని కన్నీరు పెట్టిందని అమృత అత్త తెలిపింది. ఈ జన్మలో నాన్న అని పిలిచే అదృష్టం లేని దురదృష్టవంతుడివంటూ తన కొడుకును ఎత్తుకొని అమృత విలపించిందన్నారు. 

ప్రణయ్ మర్డర్ నిందితులంతా వరంగల్ జైలు లో శిక్ష అనుభవిస్తున్నారు. మరో పెళ్లి చేసుకొనని అమృత గతంలోనే చెప్పింది. అమృత గర్భవతిగా ఉన్నప్పుడు ఖచ్చితంటగా ప్రణయే మళ్లీ పుడుతాడని అనేది. అమృత కోరుకున్నట్టుగానే అమృతకు కొడుకు రూపంలో ప్రణయ్ మళ్లీ పుట్టాడని అంతా చర్చించుకుంటున్నారు. అమృత జీవితం నిజంగా ఓ సవాలే అని పలువురు అన్నారు.