కేసిఆర్ టూర్ లో గుండెపోటుతో పోలీసు మృతి (వీడియో)

తెలంగాణ సిఎం కేసిఆర్ ప్రాజెక్టుల బాట కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తున్న వజ్జ నారాయణ అనే ఎఆర్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందారు. 

సోమవారం తెలంగాణ సిఎం కేసిఆర్ జయశంకర్ జి్లలాోని ప్రాజెక్టుల బాట కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం బందోబస్తు నేపథ్యంలో కెన్నేపల్లి పంపు హౌస్ కు బందోబస్తు కోసం వజ్జ నారాయణ వచ్చారు. బందోబస్తులో ఉన్న ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. 

కానిస్టేబుల్ మరణ వార్త తెలుసుకున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ భాస్కరన్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. వజ్జ నారాయణ మరణం తాలూకు వీడియో కింద ఉంది.