ఆంధ్రా బిజెపి ఎంపీ జీవిఎల్ కారు ఢీ, మహిళ మృతి

ఏపీ బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు కారు ఢీకొని మహిళ మృతి చెందింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలను కొండ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న జీవిఎల్ కారు అదుపుతప్పి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే చనిపోగా మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మహిళను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

కారు ప్రమాదం తర్వాత జీవిఎల్ సంఘటన స్థలం నుంచి మరో కారులో వెళ్లిపోయారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో జీవిఎల్ కారులోనే ఉన్నారు. ముందుగా వెళ్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదం జరిగినట్టు ఎంపీ తెలిపారు.

ప్రమాదంలో మృతి చెందిన బాధితురాలికి కనీసం ఎక్స్ గ్రేషియా ప్రకటించకుండా గాయపడిన మహిళను పరామర్శించకుండా వెళ్లిన ఎంపీ జీవిఎల్ పై పలువురు మండిపడుతున్నారు. ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా మరో మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉంటే కనీసం మానవతంగా కూడా ఎంపీ సహాయం చేయకపోవడంపై పార్టీల నేతలు విమర్శిస్తున్నారు.