తిరుమలలో అష్టబంధనం ప్రారంభం

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గర్భాలయంలోని మూలమూర్తి (ధృవమూర్తి) పటిష్టత కోసం విగ్రహం  కదలికలు లేకుండా ధృడంగా అతుక్కుని ఉండేందుకు చుట్టూ ఎనిమిది వైపులా సంధిబంధనం చేయడాన్నే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం అంటారు. ఈ కార్యక్రమం మంగళవారం మొదలయింది.

వైఖానస ఆచార్యుల ఆధ్వర్యంలో సంప్రదాయ శిల్పాచార్యుల సహకారంతో అష్టబంధన ద్రవ్యాలను సేకరించి, ఆయా ద్రవ్యాలకు సంబంధించిన దేవతలను ఆరాధించి అష్టబంధనం తయారుచేస్తారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఋత్వికులు శాస్త్రోక్తంగా అష్టబంధనం ద్రవ్యాలను సేకరించారు. అదేవిధంగా, ఉదయం 6 నుండి 12 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 10 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం శ్రీవారి మూలమూర్తితోపాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలకు అష్టబంధనాన్ని సమర్పించారు. అష్టబంధనం గురించి భృగు మహర్షి రచించిన భృగుప్రకీర్ణాధికారం గ్రంథంలో ఇలా వివరించారు.

”శంఖచూర్ణం, మధూచ్ఛిష్టం, లాక్షా త్రిఫలమేవ చ|

కాసీసం గుగ్గులుం చైవ చూర్ణం రక్తశిలాకృతమ్‌||

మాహిషం నవనీతం చేత్యష్టబన్ధ ఇతి స్మృత:||”

8 రకాల ద్రవ్యాలతో అష్టబంధనాన్ని తయారుచేస్తారు. వీటిలో 1.శంఖచూర్ణం – 25.5 తులాలు, 2.మధుజ (తేనెమైనం)- 3.5 తులాలు, 3.లాక్షా(లక్క) – 3.75 తులాలు, 4.గుగ్గులు(వృక్షపు బంక)- 9 తులాలు, 5.కార్పాసం(ఎర్ర పత్తి)- 1 తులం, 6.త్రిఫలం(ఎండిన ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ)- 7.5 తులాలు, 7.రక్తశిలాచూర్ణము (గైరికము)- 7.5 తులాలు, 8.మాహిష నవనీతము (గేదె వెన్న) – 15 తులాలు ఉంటాయి. వీటికి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.

శంఖచూర్ణంతో చంద్రుడిని, తేనెమైనంతో రోహిణీ, లక్కతో అగ్ని, గుగ్గులుతో చండ, ఎర్ర పత్తితో వాయువును, త్రిఫల చూర్ణంతో హరిని , గైరికముతో స్కందుడిని, గేదె వెన్నతో యముడిని ఆరాధిస్తారు.

ముందుగా ఈ ద్రవ్యాలను శుభ్రపరిచి ఆచార్యుల సమక్షంలో సంప్రదాయ శిల్పులు రోటిలో వేసి 30 నిమిషాలు బాగా దంచుతారు. బాగా దంచిన తరువాత అది పాకంగా తయారవుతుంది. ఈ పాకం చల్లబడిన తరువాత ముద్దగా చేసుకోవాలి. ఈ ముద్దను గంటకు ఒక్కసారి చొప్పున 8 మార్లు కావలసిన వెన్నను చేర్చుతూ దంచాలి. ఈ విధంగా వచ్చిన పాకాన్ని ముద్దలుగా తయారుచేస్తారు. ఈ అష్టబంధనాన్ని పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టుపక్కలా తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైఋతి, పశ్చిమం, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో సమర్పిస్తారు.

శ్రీవారి ఆలయంలో భక్తులతో ముచ్చటించిన జెఈవో :

శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం క్యూలైన్‌లో ఉన్న భక్తులతో జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు ముచ్చటించారు. దర్శనానికి పడుతున్న సమయం, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాలదీక్షితులు, ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, బొక్కసం సూపరింటెండెంట్‌ శ్రీగురురాజారావు ఇతర అధికారులు పాల్గొన్నారు.