భార్య కాపురానికి రావడం లేదని భర్త కోపంతో చేసిన పనికి బలైన చిన్నారి..?

మన భారత దేశంలో వివాహానికి చాలా ప్రాధాన్యత ఉంది. కానీ ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు అవగాహన లేకపోవడం వల్ల తరచూ గొడవలు జరుగుతున్నాయి. అయితే కొంతమంది సామరస్యంగా చర్చించుకొని వారి జీవితంలో సమస్యలుకు పరిష్కారం చేస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతూ ఆ గొడవలు పెద్దగా చేస్తున్నారు. ఇలా భార్యాభర్తల మధ్య గొడవలు అధికం కావడం వల్ల వారిద్దరు విడిపోయి పిల్లలను అనాధలుగా మారుస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం ఆత్మహత్యలు చేసుకోవటం, హత్యలు చేయటానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవల కారణంగా ఒక చిన్నారి బలైపోయిన ఘటన మహబూబ్ నగర్ లో చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళితే మహబూబ్ నగర్ జిల్లా పాలకొండ తండాకు చెందిన నేనావత్‌ శివ, శోభకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. పెళ్లయిన కొంతకాలానికి శివ మద్యానికి అలవాటుపడి భార్యతో గొడవపడి తరచూ ఆమెను కొట్టేవాడు. ఈ క్రమంలో ఇటీవల కూడా శివ భార్యను కొట్టడంతో ఆమె తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. అయితే శివ తన భార్య పుట్టింటికి వెళ్లి పెద్ద కూతురు కీర్తన (6) ని తనతో పాటు ఇంటికి తీసుకొచ్చాడు. ఈనెల 4వ తేదీన మద్యం సేవించిన శివ తన కూతురి మీద చేయి చేసుకున్నాడు.

దీంతో కీర్తన తనకి అమ్మ కావాలని మారాం చేసింది. భార్య పుట్టింటికి వెల్లిందన్న కోపంలో ఉన్న శివ మరింత కోపోద్రిక్తుడైన కన్న కూతురు అన్న కనికరం కూడా లేకుండా కీర్తన ముక్కు మూసి, గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత పాప పలకడం లేదని ఆటోలో జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అప్పటికే కీర్తన మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఇక కూతురి మరణం గురించి తెలుసుకున్న శోభ తన భర్త కూతురిని హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. అభం శుభం తెలియని కీర్తన ఇలా ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి రోదన వర్ణాతీతంగా మారింది.