బాయ్‌ఫ్రెండ్‌తో షికార్లు కొడుతూ… తల్లిదండ్రుల‌కు అలా చెప్పిందా…?

ఈ మ‌ధ్య కాలంలో సినిమాలు ప్ర‌భావం పిల్ల‌ల్లో బాగా క‌న‌ప‌డుతుంద‌నే చెప్పాలి. సినిమాలు చూసి చెడిపోతున్నారో… లేక స్వ‌త‌హాగా వాళ్ళ‌కొచ్చే ఐడియాలో తెలియ‌ట్లేదుగాని యువ‌త మాత్రం బాగా త‌ప్పుదారులు ప‌డుతున్నారు. ఇటీవ‌లె ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి నాగ‌పూర్‌లో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళితే…

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ యువ‌తి బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లింది. 21 ఏళ్ల యువతి తల్లిదండ్రులు తిడతారన్న భయంతో ఆ నిజాన్ని దాచిపెట్టి కిడ్నాప్‌ నాటకానికి తెరతీసింది. నాగ్‌పూర్‌లోని గిట్టిఖడాన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్ర‌కారం… ‘‘డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న తమ కుమార్తెను కొందరు వ్యక్తులు కిడ్నాప్‌ చేసినట్టు ఆ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువతి కళాశాలకు వెళ్తుండగా నలుగురు వ్యక్తులు కారులో ఆమెను బలవంతంగా ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారని.. ఈ క్రమంలో వారినుంచి ఆమె తప్పించుకొని సురక్షితంగా బయటపడిందని పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు కిడ్నాప్‌ ఘటన ఓ కట్టుకథ అని తేల్చారు.

కిడ్నాపర్లు ఎక్కడికి తీసుకెళ్లారో యువతిని అడిగిన పోలీసులు ఆ ఘటనా స్థలానికి ఆమెను తీసుకొని వెళ్లారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నాగ్‌పూర్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని యువతిని విచారించారు. ఈ క్రమంలో ఆమె చెప్పిన సమాధానాలు పరస్పర విరుద్ధంగా ఉండటంతో అనుమానం వచ్చి కళాశాల వద్ద సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆ రోజు తరగతులు పూర్తయిన తర్వాత యువతి ఓ వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనం పై వెళ్లినట్టు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో యువతి ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రుల సమక్షంలో పోలీసులు ప్రశ్నించగా తాను కట్టుకథ చెప్పినట్టు అంగీకరించిందని వివరించారు. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి యువతి నాగ్‌పూర్‌ నగర శివారుకు వెళ్లిందనీ.. ఆ తర్వాత అతడే ఇంటి వద్ద వదిలి వెళ్లినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.