అటు ప్రభాస్ ని, ఇటు చిరుని ఒకేసారి హ్యాండిల్

అటు ప్రభాస్ ని, ఇటు చిరుని ఒకేసారి హ్యాండిల్  

ప్రభాస్, చిరంజీవి ఇద్దరూ పదిహేను రోజుల తేడాలో పోటీపడుతున్న స్టార్స్. ఇద్దరికి భారీ మార్కెట్ ఉంది. ఇద్దరు సినిమాలు భారీ క్రేజ్ తెచ్చుకున్నాయి. రెండు ప్రతిష్టాత్మకంగా భారీ పెట్టుబడులతో రెడీ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇద్దరి సినిమాల బిజినెస్ లు, థియోటర్స్ ని ఒకేసారి మ్యానేజ్ చేయటం కష్టం. కానీ ఆ పని చేయటానికి యువి క్రియేషన్స్ సిద్దపడుతోంది.

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్‌ ప్రాజెక్ట్ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి కావటంతో మెగా తనయుడు రామ్‌ చరణ్‌ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఇప్పటికే సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్‌ ప్రారంభించేసారు.

చిరు గత చిత్ర ఖైదీ నంబర్ 150 ఘనవిజయం సాధించటం, భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈసినిమా కావటంతో సైరాకు అదే స్థాయిలో డిమాండ్‌ ఏర్పడింది. గట్టి పోటి మధ్య సాహో నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సైరా ఏపీ డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను సొంతం చేసుకున్నట్టుగా సమాచారం. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన హై బడ్జెట్‌ యాక్షన్ థ్రిల్లర్ సాహో ఆగస్టు 15న రిలీజ్‌ కానుంది.

సైరా, సాహో చిత్రాలు రెండు పదిహేను రోజుల తేడాలో రిలీజ్ ఉండటంతో ఆ ఏర్పాట్లు చూడటం కాస్త కష్టమైన పనే. అయితే రెండు సినిమాల మీదా, తమ ప్లానింగ్ మీదా ఉన్న నమ్మకంతో భారీగా పెట్టుబడులు పెట్టి సైరా రైట్స్ ని సాహో నిర్మాతలు సొంతం చేసుకున్నారు.