న్యూస్ నిజమే అయితే నిజంగా షాకే

నిన్నటి నుంచీ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. రిలీజ్ కు ముందు ఇలాంటి వార్తలు రొటీనే అయినా కాస్త ఇంట్రస్టింగ్ గానూ , అంతకు మించి ఆశ్చర్యంగానూ ఉంది. అదేమిటంటే శ్రీవిష్ణు కొత్త సినిమా శాటిలైట్ రైట్స్ మూడు కోట్లుకు అమ్ముడయ్యాయి అని. దాంతో ట్రేడ్ లో ఈ వార్త సంచలనం క్రియేట్ చేసింది. ఈ వార్తను పీఆర్ వాళ్లు వండి వార్చి మీడియాకు లీక్ చేసిందా లేక నిజంగానే అంత రేటు పలికిందా అని డిస్కస్ చేస్తున్నారు.

ఎందుకంటే శ్రీవిష్ణు లాంటి పెద్దగా క్రేజ్ లేని హీరోలకు రిలీజ్ అయ్యాక సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడవటమే గొప్ప విషయం. అలాంటిది రిలీజ్ కు ముందు సినిమా శాటిలైట్ అమ్ముడుపోవటం అదీ మూడు కోట్లకు అనేది గొప్ప విషయమే.

ఇక బ్రోచేవారెవరురా సినిమా మరో 3 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. సోషల్ మీడియాలో ఈ సినిమాపై కొద్దో గొప్పో హైప్ ఉంది కానీ సామాన్య ప్రేక్షకులు మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. శ్రీ విష్ణు కు ఉన్న ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి. అందుకు తగ్గట్టే థియేట్రికల్ బిజినెస్ అంతంతమాత్రంగానే జరిగినట్లు సమాచారం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ వార్త నిజమైతే ఈ సినిమాకు బంపర్ ఆఫర్ తగిలినట్లే.

చెప్పుకోదగ్గ మరో విషయం ఏమిటీ ఇప్పటికీ శ్రీవిష్ణు నటించిన ఎన్నో సినిమాలు శాటిలైట్ అమ్ముడుపోకుండా అలా పడి ఉన్నాయి. ఎంతోకొంతకు తోసేద్దామన్నా కొనే దిక్కు నాధుడులేదు. అలాంటి సమయంలో లో శ్రీవిష్ణు కు ఇది బ్రహ్మానందం కలిగించే వార్తే. సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంటే ఇక తిరుగు ఉండదు.