వామ్మో .. అంతకా? : ‘సాహో’ గోదావరి జిల్లాల రైట్స్

ప్ర‌భాస్ హీరోగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం సాహో. యు.వి.క్రియేష‌న్స్ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. సినిమాను ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేస్తామని నిర్మాత‌లు ప్రకటించారు. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదల అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం బిజినెస్ గురించిన వార్తలు ట్రేడ్ లో హల్ చల్ చేస్తున్నాయి.

ఈ సినిమా పై కోట్లు కుమ్మరిస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్. తాజాగా ఓం సాయి మణికంఠ ఫిల్మ్స్ వారు తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాల రైట్స్ కు గానూ 19.5 కోట్లు ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ఇప్పటిదాకా ఏ సినిమాపైనా ఈ రేటుని పెట్టకపోవటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరో ప్రక్క దిల్ రాజు మార్కెట్లో హాట్ కేకు లా ఉన్న ‘సాహో’ నైజాం, ఉత్తరాంధ్ర రైట్స్ భారీ మొత్తానికి తీసుకున్నట్లు సమాచారం. ఈ రెండు ఏరియాలకీ రెండు ఒకటి రేషియోలో నలభై అయిదు కోట్లు ఆఫర్‌ ఇచ్చాడని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇంత పెద్ద మొత్తం పెట్టడం మిగతా డిస్ట్రిబ్యూటర్స్ వల్ల అయ్యే పని కాదు. ఆ ధైర్యం చేయగలిగింది దిల్ రాజు ఒక్కడే. తనదైన స్ట్రాటజీలతో సినిమాని ప్రమోట్ చేసి నిలబెడతాడని అనేక సార్లు ప్రూవైన సత్యం. అయితే దిల్ రాజు బాగా ఎక్కువ రేటు పెట్టాడని అంటున్నారు.