ధ‌ర్మ‌సందేహం: చంద్ర‌బాబు పిక్ పాకెట‌ర్‌.. కేసు ఎందుకు పెట్ట‌లేద‌బ్బా!

ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ సినిమాలు ఎంత మొర‌టుగా ఉంటాయో.. ఆయ‌న చేసే కామెంట్లు కూడా ముక్కు సూటిగా ఉంటాయి. ఆయ‌న సినిమాల్లోని హింసలాగే.. ఆయ‌న వేసే ప్ర‌శ్న‌ల‌ను కూడా భ‌రించ‌డం క‌ష్టం. అలాంటిదే మ‌రొక‌టి. `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` బ‌యోపిక్‌లోని వెన్నుపోటు పాట విడుద‌లైన కొత్త‌లో క‌ర్నూలు `ఫిరాయింపు ఎమ్మెల్యే` ఎస్వీ మోహ‌న్ రెడ్డి రామ్‌గోపాల్ వ‌ర్మ‌పై కేసు పెట్టారు. అక్క‌డిదాకా బాగానే ఉంది. ఆర్జీవీ కూడా పెద్ద‌గా రెస్పాండ్ కాలేదు.

అక్క‌డితో వ‌దిలేసిన‌ట్టున్నారు. ఇప్పుడాయ‌న‌కు అవ‌కాశం దొరికింది. ఎస్వీ మోహ‌న్ రెడ్డిని ఓ ఆట ఆడుకుంటున్నారు. వెన్నుపోటు పాట‌ను ఆధారంగా చేసుకుని ఎస్వీ మోహ‌న్ రెడ్డి త‌న‌పై కేసు పెట్టారు. స‌రే! `తిరుప‌తి రైల్వేస్టేష‌న్ వ‌ద్ద చంద్ర‌బాబు నాయుడు జేబులు కొట్టేవాడు..`అని ఘాటుగా కామెంట్ చేసిన నాదెండ్ల భాస్క‌ర్ రావుపై క‌ర్నూలు ఎమ్మెల్యే ఎందుకు కేసు పెట్ట‌లేదంటూ ఓ సూటి ప్ర‌శ్న వేశారు. `జ‌స్ట్ ఆస్కింగ్‌` అని ఆ కామెంట్‌కు ఓ ముగింపు ఇచ్చారు.

చంద్ర‌బాబుపై నాదెండ్ల భాస్క‌ర్‌రావు చేసిన విమ‌ర్శ‌ల‌కు సంబంధించిన ఇంట‌ర్వ్యూ యూట్యూబ్ లింక్‌ను కూడా జ‌త చేశారు. బ‌యోపిక్ సినిమా తీయ‌డం ద్వారా ఎన్టీఆర్‌ను మ‌రింత పాపుల‌ర్ చేయాల‌ని ప్ర‌య‌త్నించార‌ని, దీనికంటే కూడా నాదెండ్ల భాస్క‌ర్ రావు ఇంట‌ర్వ్యూ జ‌నాన్ని బాగా ఆక‌ట్టుకుంద‌ని ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ సినిమాకు తెగిన టికెట్ల కంటే యూట్యూబ్‌లో నాదెండ్ల ఇంట‌ర్వ్యూను చూసిన వారి సంఖ్యే అధికంగా ఉంద‌ని చెప్పారు.