ఆ రూమర్ తనను బాగా బాధించిందంటున్న స్టార్ హీరో

హీరో గా లాంచ్ అవటానికి తల్లి తండ్రులకు ఖర్చు పెట్టారనే మాటలు వింటూంటాం. అందుకు సంభందించిన వార్తలు కూడా చూస్తూంటాం. కానీ వాటిల్లో కొన్నే నిజాలు ఉంటాయి. అయితే నిజం కానివి సదరు వ్యక్తులను బాధ పెడుతూంటాయి. ఇలాంటిదే బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ జీవితంలోనూ జరిగిందంటున్నాడు.

తనను సిని ఇండస్ట్రీకు పరిచయం చేసి హీరోను చేయడానికి తన తండ్రి ఎవ్వరికీ డబ్బు ఇవ్వలేదని అంటున్నారు బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌. తాను స్వశక్తితో సినిమా పరిశ్రమలో ఎదిగానని ఎవ్వరూ సాయం చేయలేదని తెలిపారు. ఇటీవల ఫిలింఫేర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్‌వీర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. తన గురించి వచ్చే రూమర్స్ గురించి అంతగా పట్టించుకోనని అంటూనే ఈ విషయం చెప్పుకొచ్చారు.

రణ్ వీర్ సింగ్ మాట్లాడుతూ….‘నేను ఇండస్ట్రీకి వచ్చిన తొలిరోజుల్లో నాపై ఎన్నో రూమర్స్ వచ్చేవి. అవి నన్ను అంతగా బాధించేవి కావు కానీ ఒక్క విషయంలో మాత్రం చాలా బాధపడ్డాను. నన్ను హీరోను చేయడానికి నిర్మాత ఆదిత్య చోప్రాకు మా నాన్న రూ.10 లక్షలు ఇచ్చారని రాసేశారు. ఈ మాటతో బాధపడ్డాను. ఎందుకంటే ఈ ప్రశ్న మా నాన్న పెంపకాన్ని వేలెత్తిచూపుతున్నట్లు అవుతుంది.

నేనెప్పుడూ చెప్పని విషయాన్ని ఎలా రాసేస్తారు? ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాను. కానీ ఇలా నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్లు రాసేస్తే అది మున్ముందు తరాలపై ప్రభావం చూపుతుంది. ఎవరైనా నాకు మెసేజ్‌ చేసి ‘నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను. నన్ను హీరోను చెయ్యి’ అని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి గుసగుసలను నమ్మకండి’ అని వెల్లడించారు రణ్‌వీర్‌.

ప్రస్తుతం రణ్‌వీర్‌ ‘83’, ‘తఖ్త్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా నటించిన ‘గల్లీబాయ్’ చిత్రం లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.