ఆశ్చర్యం: మాట్లాడి,సెల్ఫీ తీసుకునే అనుష్క విగ్రహం

విగ్రహాలు మాట్లాడతాయా…మనతో సెల్ఫీ తీసుకుంటాయా..అంటే ..అవును…చేస్తాయి అనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇదేమీ సినిమాలో సీన్ కాదు..నిజ జీవితంలోదే. బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లోని మేడం టుసాడ్స్‌ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఈ విగ్రహం స్పెషాలిటీ ఏమిటంటే…. మనుషులతో మాట్లాడే తొలి విగ్రహం ఇదే కావటం. అయితే మాట్లాడటంతో ఆగకుండా.. ఈ విగ్రహం చేతిలో ఫోన్‌ పెట్టుకుని సెల్ఫీ దిగడానికి ఆహ్వానిస్తుంది. దాన్ని మనం డిజిటల్‌ రూపంలో షేర్‌ చేసుకోవచ్చు. ఈ విగ్రహాన్ని అనుష్క సోమవారం ప్రారంభించారు.

‘ఇది నిజంగా చాలా సహజంగా ఉంది’ అంటూ అనుష్క ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. కృత్రిమమేధ సహాయంతో ఈ మైనపు విగ్రహం సందర్శకులతో మాట్లాడుతుంది. దాంతో ఈ అనుష్క విగ్రహం చూడటానికి ఎక్కడెక్కడి సందర్శకులు ఎగబడుతున్నారు.

అనుష్క శర్మ కెరీర్ విషయానికి వస్తే… ప్రస్తుతం ‘జీరో’ సినిమా ప్రచారంలో బిజీగా ఉందామె. షారుక్‌ ఖాన్‌ ఇందులో హీరో గా చేస్తున్నారు. కత్రినా కైఫ్‌ మరో హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి … ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకుడు. డిసెంబరు 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.

ఇక అనుష్క ఈ ఏడాది ‘సూయీ ధాగా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించిన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. అంతేకాదు బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.