బాబుని ఇరికించేస్తున్న చినబాబు.. ఫ్లోలో మిస్ ఫైర్!

ప్రస్తుతం లోకేష్ పాదయాత్రలో బిజీగా ఉన్నారు. తండ్రిని సీఎం చేయాలనే కసితో కాలినడక ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా లోకేష్ మైకందుకుని చేస్తున్న ప్రసంగాల్లో ఇస్తున్న హామీలు, చేస్తున్న వాగ్ధానాలపై పెదవి విరుస్తున్నారు విశ్లేషకులు!

తెలుగుదేశం పార్టీ ఇప్పుడేదో కొత్తగా పుట్టినట్లు.. తొలిసారిగా అధికారం కోసం ప్రయత్నిస్తున్నట్లుగా ఫీలవుతున్నట్లున్నారు లోకేష్! పోనీ ఆ తెలుగుదేశం పార్టీ తరుపున ఆయనేమీ ముఖ్యమంత్రి అభ్యర్ధి కూడా కాదు! కానీ.. హామీల విషయంలో మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. విమర్శల విషయంలో మాత్రం.. గత ప్రభుత్వం తమదే అన్న విషయం మరిచిపోతున్నారు!

తాజాగా తొండమానుపురం పంచాయతీ పరిధిలో 300 కి.మీ. పూర్తి చేశారు లోకేష్. ఈ సందర్భంగా పాదయాత్రకి తీపిగుర్తుగా నిలిచినందున తమ పార్టీ అధికారంలోకి రాగానే ఈ పంచాయతీ పరిధిలోని 13 గ్రామాలకి రక్షితమంచినీటి పధకం ఏర్పాటుచేసి శాస్వతంగా త్రాగునీటి సమస్య లేకుండా చేస్తానని లోకేష్‌ హామీ ఇచ్చారు.

టిడిపి అధికారంలో ఉన్నప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం సుమారు 120 పధకాలు రూపొందించి అమలుచేశామని.. మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తే ఈసారి బీసీలలో ఉపకులాలవారికి సైతం మేలు చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తానని తాను అందరికీ హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు చినబాబు!

విచిత్రం ఏమిటంటే… “ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద ప్రతి గ్రామానికి / పట్టణానికి రక్షిత నీటి సరఫరా, ప్రతి వీధికీ ఉచిత కుళాయి.. ఇంటింటికీ రూ. 2 కే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ సరఫరా పథకం అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయన్ని గుర్తుచేస్తున్నారు వైసీపీ నేతలు!

దీంతో.. ఎన్నికల ముందు హామీలివ్వడం వరకే తప్ప గద్దెనెక్కినతర్వాత ఆ విషయం చంద్రబాబు గాలికి వదిలేశారని లోకేష్ పరోక్షంగా చెప్పినట్లయ్యిందని అంటున్నారు వైసీపీ నేతలు. మరోసారి అవకాశం ఇస్తే.. అప్పుడు మాట తప్పాం.. ఈసారి తప్పకుండా మంచినీరు అందిస్తామని చెప్పడం దౌర్భాగ్యం కాక మరేమిటనేది వారి ప్రశ్న!