వైసీపీలో మూడు వికెట్లు డౌన్.! తర్వాతేంటి.?

ఎంపీ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. వెరసి, ఇప్పటికి వైసీపీ నుంచి మూడు వికెట్లు పడిపోయినట్లే లెక్క. మరో వికెట్.. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిదంటూ ప్రచారం జరుగుతోంది.

అంటే, కేవలం నెల్లూరు జిల్లా నుంచే హ్యాట్రిక్.. అన్నమాట. ఈ ముగ్గురిలో ఇంకోసారి గెలవగలిగేంత సీన్ ఎవరికి వుంది.? అంటే, ఎవర్నీ తక్కువగా చూడలేం. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.

మాజీ మంత్రి పేర్ని నానితో పోల్చి చూస్తే, మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో పోల్చి చూస్తే.. ఖచ్చితంగా ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు తమ తమ నియోజకవర్గాల ప్రజలతో సన్నిహిత సంబంధాలున్నాయి.

అయినాగానీ, రాజకీయాలన్నాక ఇలాంటివి సర్వసాధారణమే. ఓ వైపు ‘వైనాట్ 175’ అంటున్నారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కానీ, పార్టీలో అంతర్గతంగా పెరుగుతున్న కుమ్ములాటలు, అసంతృప్తిని చల్లార్చే చర్యలు జరగడంలేదు. అన్నీ ముఖ్యమంత్రే చూసుకోవాలంటే ఎలా.? వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇలా ముఖ్య నేతలున్నారు. పదవులకు తప్ప, ఆర్భాటాలకు తప్ప..

పార్టీలో అంతర్గత సమస్యలకు చెక్ పెట్టడానికి పనికిరాకపోతే ఎలా.? వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయ్.. పార్టీలో ఇంకా అసంతృప్తి పెరుగుతూపోతే.. వైనాట్ 175 కాదు.. అధికారానికి దూరమయ్యే పరిస్థితి రావొచ్చు.