అచ్చెన్న ఇలాకాలో గిర్రున తిరిగిన ఫ్యాన్!

సాధారణంగా ప్రతీ రాజకీయ పార్టీకి కొన్ని కంచుకోటలు వంటివి ఉంటాయి. అవి అధినేతలు పోటీచేసే స్థానాలు కావొచ్చు.. బలమైన నేతల ప్రాంతాలు కావొచ్చు. ప్రస్తుతానికి ఏపీలో జనసేనకు ఇంకా అలాంటివేమీ లేకపోయినా.. టీడీపీకి మాత్ర కొన్ని ఉన్నాయి. వాటిలో శ్రీకాకుళం జిల్లా ఒకటి. పైగా.. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడి సొంత జిల్లా అది. ఆ జిల్లాలో ఫ్యాన్ గిర్రున తిరిన ఫలితం తాజాగా విడుదలయ్యింది.

వివరాళ్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాలో స్థానిక సంస్థలకు సంబంధించి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయభేరీ మోగించింది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు జిల్లా వ్యాప్తంగా 776 ఓటర్లుగా ఉండగా… వైసీపీ తరఫున నిలబడిన నర్తు రామారావుకు 632 ఓట్లు లభించాయి. అయితే ఇక్కడనుంచి టీడీపీ పోటీకి దిగకపోయినా… ఇండిపెండెంట్ గా పోటీకి దిగిన ఆనెపు రామక్రిష్ణకు తెరవెనుక మద్దతు బలంగా ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినా కూడా రామకృఇష్ణకు 108 ఓట్లు లభించాయి.

ఇదే క్రమంలో.. టీడీపీతోపాటు జనసేన కూడా తన మద్దతును పరోక్షంగా రామకృష్ణకే ఇచ్చిందంట. అయినా కూడా ఎనభై శాతానికి పైగా ఓట్లను ఆ పార్టీ అభ్యర్ధి నర్తు రామారావు దక్కించుకోవడాన్ని రికార్డుగా చెబుతున్నారు స్థానికులు. వాస్తవానికి ఇది ఏకగ్రీవం కావాల్సిన సీటు! కానీ.. ఏదో ఒక అద్భుతం జరగకపోద్దా అనో.. వైసీపీకి ఏదైనా వ్యతిరేకత రాకపోతాదా చూద్దాం అనే ఆత్రుతతోనో.. టీడీపీ ఇండైరెక్ట్ గా ఎంటరై.. ఎలక్షన్ పెట్టడం తప్పనిసరి చేసింది. ఫలితం వైకాపాకు సుమారు 80%పైగా సీట్లు!

అయితే.. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే… శ్రీకాకుళం జిల్లా టీడీపీకి కంచుకోట. ఇదే సమయంలో అక్కడ జనసైనిక బలం కూడా తోడయ్యింది. అలాంటి చోట వైసీపీ గెలవడం అంటే.. అది రాబోయే ఎన్నికలకు శుభసూచికంగా చెప్పుకుంటున్నారు వైకాపా నేతలు. మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయ వ్యూహాలు ఫలించాయో, టీడీపీపై తమ అభిప్రాయం మారలేదని ఇంకా పరిస్థితులు అలానే ఉన్నాయనే సంకేతమో తెలియదు కానీ… రికార్డ్ విక్టరీ నమోదైంది!