ముందస్తు ప్రతిపాదన.! ప్రధాని ముందర.! సాధ్యమేనా.?

రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తావించడం సర్వసాధారణమైన విషయం. ప్రధాని కావొచ్చు, ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దలు కావొచ్చు.. వీరిని, రాష్ట్ర ముఖ్యమంత్రి కలిస్తే.. అందులో రాజకీయ అంశాలు ఎందుకు వుంటాయి.? వుంటే, వుండొచ్చుగాక.. అది వేరే వ్యవహారం.

ముందస్తు ఎన్నికల గురించి ప్రధాని నరేంద్ర మోడీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేస్తారా.? తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ముందస్తు ఎన్నికలు జరిపించాలని ప్రధానిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరతారా.?

మీడియా ఈ స్థాయిలో దిగజారిపోవడం ఇదే కొత్త కాదు.! వాస్తవానికి, ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనుకుంటే, అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నిర్ణయంపై ఆధారపడి వుంటుంది. ప్రభుత్వాన్ని రద్దు చేసేసుకుని, ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంటే, ఆయన్ని ఆపేవారు ఎవరుంటారు.?

ముందస్తు ఎన్నికల వల్ల బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే లాభం గానీ, నష్టం గానీ.. ఏమీ లేవు. ఎందుకంటే, ఆ పార్టీకి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరైన చోటే లేదు. కేంద్ర – రాష్ట్ర సంబంధాల నేపథ్యంలోనే ప్రధాని – ముఖ్యమంత్రి భేటీలు జరుగుతున్నాయి. అవి సత్ఫలితాలను ఇస్తున్నాయి కూడా.

2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న దరిమిలా, కేంద్రంలోని బీజేపీ కూడా ఒకింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సరిగ్గా, ఈ సమయాన్ని వైఎస్ జగన్ ఉపయోగించుకుంటున్నారంతే.! అంతకు మించి, ప్రధానితో రాజకీయ వ్యవహారాలు వైఎస్ జగన్ మాట్లాడతారని ఎలా అనుకోగలం.?