ఇదా లాజిక్… కుప్పంలో జగన్ నమ్మకం తెలిసిపోయింది!

వచ్చే ఎన్నికల్లో 175 కి 175 అసెంబ్లీ స్థానాలు, 25 కి 25 పార్లమెంట్ స్థానాలూ గెలవాలని బలంగా కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు తాను చేయాల్సిందంతా చేశానని.. ఇకపై ఉన్న 45 – 50 రోజుల్లో అభ్యర్థులంతా జనల్లో ఉండాలని, వారికి మన ప్రభుత్వం వల్ల జరిగిన మేలు వివరించాలని, వాళ్లకు అర్ధమయ్యేలా చెప్పాలని, అదే జరిగితే 175 కన్ ఫాం అని అంటున్నారు జగన్.

ఇక ప్రధానంగా మంగళగిరిలో 2019 ఫలితాలు రిపీట్ కావాలని.. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో కూడా ఇప్పటివరకూ ప్రకటించకపోవడంలోనే విషయం అర్ధమవుతుందని అంటున్నారని తెలుస్తున్న నేపథ్యంలో… కుప్పంలో మాత్రం భారీ మెజారిటీ సాధించాలని జగన్.. శ్రేణులకు దిశానిర్ధేశం చేశారని తెలుస్తుంది. ఇందులో భాగంగా… ఇటీవల తన పర్యటనలో కుప్పం ప్రజల్లో కొత్త ఉత్సాహం చుసినట్లు జగన్ భావిస్తున్నారని అంటున్నారు.

కుప్పంలో జరిగిన బహిరంగ సభలో జగన్ చాలా స్పష్టంగా అన్ని విషయాలు ప్రజలకు వివరించారు. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు హయాంలో జరిగిన నష్టాన్ని సవివరంగా వివరించారు. ఎన్నో ప్రాజెక్టులను కాలదన్నుకున్నారని అన్నారు. తనకు లాభం వచ్చే పని తప్ప మరేమీ చేయరని తెలిపారు. గతం 35 ఏళ్లుగా చంద్రబాబు కుప్పంలో చేయలేనిది గడిచిన 5 ఏళ్లలో తాను చేయగలిగాననే విషయం జగన్ క్లీన్ గా చెప్పే ప్రయత్నం చేశారు.

ఇదే సమయంలో తన వల్ల మేలు జరిగితేనే.. మీమీ కుటుంబాలకు మంచి జరిగితేనే ఓటు వేయమని జగన్ స్పష్టంగా చెబుతున్నారు. ఈ కామెంట్ పై విపరీతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో… తాజాగా కుప్పంలో తాజాగా సాగునీరు, త్రాగు నీరుకు సంబంధించి చేసిన పని.. చిత్తురు డెయిరీ పునఃప్రారంభం తో పాటు ఇంటింటికీ జగన్ సర్కార్ చేసిన మేలుల విషయాలు తెరపైకి వస్తున్నాయి.

ఇందులో భాగంగా… జగన్ తన ఐదేళ్ల పాలనలో కుప్పం నియోజకవర్గానికి కేటాయించిన మొత్తం నిధులు రూ.రూ.1,400 కోట్లు కాగా… కుప్పంలో ఉన్న మొత్తం 87 వేలు పై చిలుకు ఇళ్లలోనూ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన ఇళ్ల శాతం 93.29గా ఉందని అంటున్నారు. ఈ సమయలో ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందినవారు కచ్చితంగా తనవైపే చూస్తారని జగన్ భావిస్తున్నారు. విశ్లేషకుల అభిప్రాయం కూడా అలానే ఉంది. ఇదే జగన్ ధైర్యం అని అంటున్నారు పరిశీలకులు.

ఇదే సమయంలో… మొన్న జరిగిన కుప్పం సభలో మైకందుకున్న జగన్… కుప్పం నియోజకవర్గంలో టీడీపీ హయాంలో 30 వేల ఇళ్లకు మాత్రమే పెన్షన్‌ ఇవ్వగా.. వైసీపీ హయాంలో 45 వేల కుటుంబాలకు ఇస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో 30వేలకు పైగా కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని.. వాటితోపాటు ఆసరా, చేయూత, వసతి దీవెన, విద్యాదీవెన, అమ్మఒడి కూడా అందించామని స్పష్టం చేశారు. దీంతో… కుప్పంలో వైసీపీ జెండా ఎగరడానికి ఇవన్నీ సహకరిస్తాయని జగన్ భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ విషయంపైనే కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ప్రచారం వేగవంతం చేసిందని.. ఇందులో భాగంగా గడప గడపకూ వెళ్లి ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నారని.. ప్రధానంగా మహిళా ఓటర్లు ఈ విషయంలో పాజిటివ్ గా స్పందించే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు. మరి అదే జరిగితే… కుప్పంలో ఫ్యాన్ గిరా గిరా తిరిగితే… అది ఒక చరిత్రే!!