ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో “సోషల్ మీడియా పోస్టులు – అరెస్టులు” అనేది ఎంతో కీలకమైన విషయం అనేది తెలిసిందే. ఏపీలో సోషల్ మీడియా పోస్టులు కేవలం రాజకీయాలకు సంబంధించి.. రాజకీయంగా ఆయా పార్టీలు, వాటి అధినేతలు, అందులోని కీలక నేతలు, ప్రభుత్వ పెద్దలు తీసుకునే నిర్ణయాలపై ప్రశంసలు, విమర్శలతో సాగితే ఎవరికీ ఇబ్బంది ఉండదు! కానీ.. అవి కాస్తా రోజు రోజుకీ శృతిమించిపోతున్నాయని అంటున్నారు.
ఉదాహరణకు గత కొన్ని రోజులుగా వైఎస్ జగన్ తో పాటు వైఎస్ వంశ వృక్షం గురించి రకరకాల పోస్టులు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. కొంతమంది నెటిజన్లు.. జగన్ ను విమర్శించేందుకు కేవలం రాజకీయమైన అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా… ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఆయన క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తూ.. సైకో, హంతకుడు వంటి పద ప్రయోగాలు చేస్తూ.. దూషణలకు దిగుతూ దిగజారుతున్నారు.
ఇక ఇటీవల మరో విషయంలో ఓ వర్గం సోషల్ మీడియా గ్రూపులు.. డిజిటల్ మీడియా, వెబ్ మీడియా ముసుగులోని కొన్ని సంస్థలు.. జగన్ తో పాటు రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని ఆయన భార్య వైఎస్ భారతిని రోడ్లపైకి లాగుతూ, రాయలేని రీతిలో పోస్టులు పెడుతున్నారు. ఇది మానసిక అనారోగ్యమా.. లేక, మూర్ఖత్వంతో కూడిన జర్నలిజమా అనేది తెలియదు కానీ… గత కొంతకాలంగా పలు న్యూస్ వెబ్ సైట్స్, యూట్యూబ్స్ ఛానల్స్ తో పాటు వాటి ముసుగులో నడుస్తున్న ఆయా సోషల్ మీడియా గ్రూపులూ ఈ విధంగా ఉచ్ఛనీచాలు మరిచిపోతున్న పరిస్థితి!
ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ భార్య భారతీ రెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా… మీడియా ముసుగులో తనపై తప్పుడు కథనాలు వండి వార్చుతూ, దిగజారిన పోస్టులు పెడుతున్నవారిపై చర్యలకు ఉపక్రమించారు! ఈ సమయంలో… తనపై సర్క్యులేట్ అవుతున్న తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ మెటా ప్లాట్ ఫామ్స్, ఎక్స్ కార్పొరేషన్, యూట్యూబ్, గూగుల్ లకు లీగల్ నోటీసులు పంపారు.
ఈ సందర్భంగా… “ప్రస్తుత లీగల్ నోటీసులో ప్రస్తావించిన అంశానికి సంబంధించిన ఏ విధమైన కంటెంట్ అయినా, అలాగే నా క్లయింట్ కు అపకీర్తి కలిగించే సమాచారాన్ని ప్రచురించడం, ప్రసారం చేయడం, అప్ లోడ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, ప్రచారం చేయడం, షేర్ చేయడం, వ్యాప్తి చేయటాన్ని తక్షణమే నిలిపివేయాలి.. మీరు ప్రచురించిన, ప్రసారం చేసిన, పోస్టు చేసిన కథనాలు తప్పుడు కథనాలని అంగీకరిస్తూ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి.. అలాగే ఆ కంటెంట్ ఇప్పటికే తొలగించినట్లు ప్రకటించాలి..” అని లాయర్ ప్రద్యుమన్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఒక యూట్యూబ్ ఛానల్, ఓ న్యూస్ వెబ్ సైట్ కూ నోటీసులు పంపారు.
దీంతో.. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. పైన పేర్కొన్న ఓ యూట్యూబ్ ఛానల్, మరో న్యూస్ వెబ్ సైట్ లలో వైఎస్ భారతిని లక్ష్యంగా చేసుకుంటూ తప్పుడు కథనాలు, పోస్టులను వ్యాప్తి చేస్తున్నారని.. ఇదంతా ప్రణాళికాబద్ధంగా సాగుతున్న దాడి అని.. ఇప్పటికైనా భారతీ రెడ్డి ఈ విషయంలో సరైన నిర్ణయమే తీసుకున్నారని అంటున్నారు పరిశీలకులు. మరోవైపు… సదరు సంస్థలు “బేషరతుగా క్షమాపణలు” చెప్పాలనే విషయమూ చర్చనీయాంశంగా మారిందని చెబుతున్నారు.
