Yellow Politics : పచ్చ నీతి: ప్రత్యేక హోదా కంటే క్యాసినో ముఖ్యమైన అంశమా.?

Yellow Politics : ప్రత్యేక హోదా విషయమై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తే కాస్తో కూస్తో ప్రయోజనం వుండొచ్చు. రైల్వే జోన్ గురించో, విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ అంశం మీదనో, ఇంకో ముఖ్యమైన అంశాన్నో పార్లమెంటులో ప్రస్తావించాల్సిన తెలుగుదేశం పార్టీ, చిత్రంగా గుడివాడలో సంక్రాంతి సందర్భంగా జరిగిన ‘క్యాసినో’ వ్యవహారాన్ని భుజానికెత్తుకుంది.

రాజ్యసభ సాక్షిగా టీడీపీ ఎంపీ కనకమేడల చేసిన ‘క్యాసినో’ ప్రసంగం ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ పట్ల ఎంత బాధ్యత వుంది.? అన్నదానికి ఇంతకు మించిన నిదర్శనం ఇంకోటా అవసరం లేదన్నది సర్వత్రా వ్యక్తమవుతోన్న అభిప్రాయం.

సరే, గుడివాడలో నిజంగానే క్యాసినో జరిగిందా.? దానికీ, మంత్రి కొడాలి నానికీ సంబంధమేంటి.? వంటి అంశాలపై చర్చ జరగాల్సిందే. విచారణ జరగాలి, నిజాలు నిగ్గు తేలాలి. కానీ, అది రాష్ట్ర పరిధిలోని అంశం. ఈ వ్యవహారంపై టీడీపీ, కోర్టును ఆశ్రయించే అవకాశాన్నీ వినియోగించుకోవచ్చు. కానీ, అలా చేయలేదు.

తెలుగుదేశం పార్టీ సంగతి పక్కన పెడితే, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ నినదిస్తున్న వేళ, రాష్ట్రానికి చెందిన ఎంపీలంతా పార్లమెంటు సాక్షిగా ఒక్కతాటిపైకొచ్చి, కేంద్రాన్ని నిలదీయాలి కదా.?

టీడీపీ క్యాసినో వ్యవహారాన్ని నెత్తికెత్తుకుంటే, ఆ టీడీపీని విమర్శించడమే పనిగా పెట్టుకుంది వైసీపీ. ఇలా ఒకర్ని ఒకరు విమర్శించుకోవడం వల్ల రాష్ట్రానికి ఏంటి లాభం.? పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్న చందాన తయారైంది వ్యవహారం. టీడీపీ – వైసీపీ కొట్లాట పుణ్యమా అని, కేంద్రం రాష్ట్రాన్ని పట్టించుకోవడమే మానేసిందని అనుకోవాలేమో.