ఏపీ డిజిపి పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ విజయసాయిరెడ్డి

స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘాన్ని కూడా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు లెక్క పెట్టడంలేదని, అందుకు రాష్ట్ర డీజీపీ ఠాకూర్ ప్రధాన కారకుడంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ నేతలు గురువారం ఈసీతో భేటీ అయ్యారు.

 ఏపీ డీజీపీ ఠాకూర్ పై వారు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర డీజీపీ హోదాలో ఉన్న ఠాకూర్ తన కాన్వాయ్ లో రూ.35 కోట్లు రాజధాని అమరావతి నుంచి ప్రకాశం జిల్లాకు తరలించారని ఇది మార్చి 24న జరిగిందని విజయసాయి తెలిపారు. ఇదే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఠాకూర్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని విజయ సాయిరెడ్డి మండిపడ్డారు. ఠాకూర్ ను వెంటనే బదిలీ చేయకపోతే ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని విజయసాయి ఆందోళన వ్యక్తం చేశారు.

ఏపీలో ఐటీ, సీబీఐలకు ప్రవేశం లేదంటూ కొత్త భాష్యం చెబుతున్న చంద్రబాబు, ఇప్పుడు ఈసీని సైతం లెక్కలోకి తీసుకోకపోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. వీళ్లకు తోడు కేఏ పాల్ కూడా తయారయ్యాడన్నారు. ప్రజా శాంతి పార్టీ అధినేత డబ్బుల కోసం చంద్రబాబుకు అమ్ముడుపోయాడని ఆరోపించారు.