ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు చేస్తొన్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి, సోమవారానికల్లా సమస్యను పరిష్కరించాలని ఆదేశించినా, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినా…. ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపినా… తాజా పరిస్థితి సామాన్యుడికి ఎరుకే!
ఎందుకంటే… ఏపీలో పలు పెట్రోల్ బంకుల వద్ద కిలో మీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తుండగా.. దాదాపు సంగం పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని చెబుతున్నారు. అలా అని ఈ సమస్య రాత్రికి రాత్రి వచ్చింది కాదని.. సుమారు మూడు రోజులుగా చినికు చినుకుగా మొదలైన ఈ సమస్య ఇప్పుడు తీవ్ర రూపం దాల్చిందని చెబుతున్నారు.
ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం సమయానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,510 బంకుల్లో సుమారు 70 శాతానికిపైగా మూతబడ్డాయని అంటున్నారు! ఈ విషయం తీవ్ర ఆందోళన కలిస్తోంది. కొన్నిచోట్ల ఉన్న కొద్ది స్టాక్ ను రేషన్ లెక్కన అందిస్తున్నారు. ఈ పరిస్థితుల వల్ల జరిగే నష్టం తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని.. ప్రధానంగా ఆక్వా రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు.
దీంతో… ఇది పూర్తిగా ప్రభుత్వ చేతకానితనం, అధికారుల అలసత్వం యొక్క ఫలితమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు… పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తుది దశ ఎన్నికలు పూర్తయిన వెంటనే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయని ప్రచారం జరుగుతోంది. దీంతో.. ఒక్కసారిగా 50 శాతానికిపైగా పెట్రోల్, డీజిల్ కు డిమాండ్ పెరిగిందని అంటున్నారు.
ఇదే సమయంలో.. బంకుల్లో నుంచి భారీ మొత్తంలో పెట్రోల్, డీజిల్ ను తీసుకెళ్లి బ్లాక్ లో విక్రయాలు చేస్తున్నారని.. అయినా అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి!
ఈ వ్యవహారంలో అధికార పార్టీలకు చెందిన పలువురు నేతలు, వారి అనుచరుల హస్తాలు ఉన్నాయనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ప్రధానంగా వీరి విషయంలో అధికారులు చూసీ చూడనట్లు నడుచుకోవడంతోనే ఈ వ్యవహారం చినుకుతో మొదలై వరదలామారి, బురద సృష్టించిందని చెబుతున్నారు.
అదే విధంగా…… పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ముడిచమురు ధరలు పెరగడంతో ఇంధన సంస్థలకు నష్టాలు పెరిగాయని.. దీంతో అమ్మకాలు కుదించుకునేందుకు అవి ప్రయత్నిస్తున్నాయని అంటున్నారు.
ప్రభుత్వ రంగంలోని పెట్రోలియం సంస్థల ఆధ్వర్యంలోని ఔట్లెట్ల ద్వారా అధికశాతం అమ్మకాలు జరుగుతాయని.. వీటిలో ఓ సంస్థ గత నెలలో అధికంగానే సరఫరా చేసినా.. ఏప్రిల్ రెండో వారం నుంచి తగ్గించిందని అంటున్నారు.
దీంతో.. మరో రెండు సంస్థలకు చెందిన ఔట్లెట్లపై ఆ ప్రభావం పడిందని.. ఫలితంగా సరఫరా వ్యవస్థ దెబ్బతిందని చెబుతున్నారు. కొన్ని ఔట్లెట్లలో ఇంధనాన్ని కేవలం బల్క్ వినియోగదారులకే మళ్లిస్తుండటమూ సమస్యకు కారణం అయ్యిందని చెబుతున్నారు.
ప్రధానంగా.. ఏప్రిల్ 26, ఆదివారం కొన్నిచోట్ల అధికారులు తనిఖీలకు వెళ్లినప్పుడు నిల్వలున్నా.. పంపిణీ చేయడం లేదనే విషయం వెల్లడైందని తెలుస్తోంది.
ఈ విధంగా సమస్యకు గల కారణాలు… ప్రభుత్వం అసమర్ధత, అధికారుల అలసత్వం, ప్రభుత్వ పెద్దలకు ముందు చూపు కొరవడటం, ఏప్రిల్ 29న వెస్ట్ బెంగాల్ ఎన్నికల తర్వాత ధరలు పెంచాలనే ఆలోచనలో మోడీ సర్కార్ ఉందనే ప్రచారం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం, తద్వారా పెరుగుతోన్న బ్లాక్ మార్కెట్ విమర్శలు.. గా ఉన్నాయి!
వాస్తవాలు ఇలా ఉంటే.. ‘ఏ వంకా లేనివాడు డొంక పట్టుకుని వేళాడాడు’ అన్నట్లుగా.. ఓ వర్గం మీడియా మాత్రం ఏపీలో తాజా ఇంధన కొరత వెనుక కుట్ర దాగి ఉంది అని చెబుతూ.. దీన్ని వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేసిందనే విమర్శలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి!
దీంతో.. ఏ మాత్రం సహేతుకత లేని ఇలాంటి కథనాల వల్ల అక్షరాలు సిగ్గు పడటంతో పాటు, జర్నలిస్టులపై సమాజంలో గౌరవం మరింత తగ్గిపోయే ప్రమాదం చాలా ఉందని అంటున్నారు నెటిజన్లు!
ఆ విమర్శలు, అభిప్రాయల సంగతి అలా ఉంచితే.. 11 సీట్లతో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ.. కేవలం పులివెందుల ఎమ్మెల్యే అధినేతగా ఉన్న పార్టీ.. రాష్ట్రంలో ఇంత చేస్తుంటే… భారీ మెజారిటీతో బంపర్ విజయం సాధించి.. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ ఏమి చేస్తున్నట్లు అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ఫలితంగా… ఇలాంటి కథనాలు వైసీపీ పై బురద జల్లడం, తద్వారా ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడం సంగతేమో ఏమో కానీ.. కూటమి సర్కార్ చేతకానితనాన్ని, అనుభవం ఉన్నప్పటికీ చంద్రబాబు అసమర్థతని ప్రజల ముందు స్పష్టం చేస్తుందని అంటున్నారు పరిశీలకులు.
ఏది ఏమైనా తాజా పరిస్థితులతో వరి, ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. ప్రధానంగా.. రబీ కోతలు ముమ్మరంగా సాగుతుండటంతో పెద్ద ఎత్తున కోత యంత్రాలు పని చేస్తున్నాయి. వాటికి డీజిల్ దొరకకపోవడంతో.. కోతలు మధ్యలోనే ఆగిపోతున్నాయని చెబుతున్నారు.
మరి ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో ఆక్వా చెరువుల్లో ఆక్సిజన్ స్థాయిలు పడిపోకుండా ఉంచేందుకు ఏరియేటర్లు వినియోగం పెరిగిందని చెబుతున్నారు. దీంతో డీజిల్ వినియోగం ఎక్కువగా పెరుగుతుంది.
ఎందుకంటే… మొన్నటి వరకు రొయ్యలు పిల్లదశలో ఉండటంతో రాత్రి 10 గంటలకు వేసే ఏరియేటర్లను.. సుమారు గత వారంరోజులుగా సాయంత్రం 6 గంటల నుంచే తిప్పుతున్నారు. అవి సమయానికి తిరగకపోతే ఆక్వారైతు కు తీవ్రంగా దెబ్బ తగిలే ప్రమాదం ఉంది! ఎందుకంటే.. ఆక్వా రైతులను రొయ్య కొట్టే దెబ్బ చాలా తీవ్రంగా ఉంటుంది!
స్పందించిన వైసీపీ!:
ప్రస్తుతం ఏపీలో సామాన్యులకు ఇంధన కష్టాలు ఎదురవ్వగా.. వైసీపీ నేతలు క్విక్ గా రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లి.. ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి నేరుగా వినియోగదారుల్నే అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో… తాజా పరిస్థితులపై వైసీపీ నాయకులకు ప్రజలు మొరపెట్టుకున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన వైసీపీ నేతలు… దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఇంధనం కొరత కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకని ప్రశ్నించారు. ఇదే సమయంలో.. చంద్రబాబు సర్కార్ కు ముందు చూపు లేకపోవడం వల్లే, నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్య వెనుక కుట్ర కోణం అనేవి అన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగాలని.. తమ చేతకాని తనాన్ని ఇతరులపై రుద్దే ప్రయత్నమని మండిపడ్డారు!
