పవన్ కళ్యాణ్ కాకినాడలో పోటీ చేస్తారా.?

వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరేశారు.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా స్పందించాల్సి వుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఆయన మరికొన్ని రోజులు వారాహి యాత్ర చేయనున్న దరిమిలా.. రేపో మాపో స్పందిస్తారేమో చూడాలి.!

కాకినాడలో జనసేన అధినేత పోటీ చేస్తే, ఆ పోటీ రసవత్తరంగా మారుతుంది. ‘బస్తీ మే సవాల్.. చిత్తు చిత్తుగా ఓడిస్తా..’ అంటున్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. గాజువాకలో, భీమవరంలోనూ 2019 ఎన్నికల్లో ఓడిన జనసేనాని, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకి వెళతానంటున్నారు.

ముందైతే జనసేన అధినేత పోటీ చేసే నియోజకవర్గమేదో తేలాలి కదా.! ఇంతవరకు ఒక్క నాదెండ్ల మనోహర్ తప్ప, జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థులు, వారి నియోజకవర్గాల సంగతి తేలలేదు.

పిఠాపురం నుంచి జనసేనాని పోటీ చేయొచ్చన్న ప్రచారమైతే జరుగుతోంది. పిఠాపురం అంటే, కాకినాడకి పక్కనే వున్న నియోజకవర్గం. సో, పోటీ చేస్తే.. అక్కడైనా వ్యవహారం రసవత్తరంగానే వుంటుంది.

నానా రకాల ఆరోపణలూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద జనసేనాని చేసేశారు. పౌరుషం చాటాలనుకుంటే, ఆయన మీద పోటీ చేసి గెలవాలి. ‘నువ్వు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా.. నేను గెలిస్తే నువ్వు రాజకీయ సన్యాసం చెయ్..’ అని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే,