జెసి బ్రదర్స్ లేని ‘అనంత’ రాజకీయాలు రక్తి కడతాయా?

ఏ మాటకామాటే చెప్పుకోవాలి, అనంతపురం రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల్ని ఒక కోణంలో నుంచి ప్రజలు ఎంత వ్యతిరేకిస్తారో మరో కోణం నుంచి అంతే అభిమానిస్తారు. వాళ్లిద్దరని చూసి జడిసిపోతారు, అయితే, ఆపత్సమయాల్లో వాళ్లే దిక్కు.

 వాళ్లిద్దరు ఎవరో కాదు, ఫ్యాక్షనిస్టులుగా, పెత్తందార్లుగా,ఫ్యూడల్ లార్డ్సోగా  పేరు పడిన జెసి సోదరులు. వాళ్ల మీద ఉన్నన్ని విమర్శలు జిల్లాలో మరొక రాజకీయనాయకుడి మీద లేవు. ఒక నెంబర్ లైసెన్స్ తీసుకుని పది బస్సులు నడపుతారని,  వ్యతిరేకిస్తే తొక్కేస్తారని, లేపేస్తారని వాళ్ల సొంతూరు తాడిపత్రిలో కథకథలుగా చెబుతారు. ఎన్నో హత్యలు, దాడులను వాళ్లకి అతికించి చెబుతారు.  సాధ్యమయినంతవరకు వాళ్లజోలికి వెళ్లకూడనేది అక్కడి సోషలైజేషన్ లో ఒక భాగం. జెసి దివాకర్ రెడ్డి అన్నా, ప్రభాకర్ రెడ్డి అన్నా ప్రజల్లోనే కాదు, ఆఫీసర్లలో కూడా చచ్చేంత భయం. జెపి బ్రదర్స్ పర్మిషన్ లేకుండా అక్కడ పనులేవీ జరగవు. అంతేకాదు, వాళ్లనుకుంటే అక్కడ కాని పనులు కూడా ఉండవు.  మొత్తానకి లోలోన వాళ్లంటే ఆవూర్లో అందరికి వణుకు. ఒక్క మాటలో చెబితే, … బొట్లు బొట్లు పడాతాయి.

వాళ్లకి మరొక కోణం ఉంది. ఆవూర్లో ఎవరినైనా ఆడగండి. ఏనోట లోలోన ద్వేషిస్తారో, పబ్లీకున పొగడతారు. ఎదైనా పని కావాలంటే, జెసి ఇంటికెళితే, పనికాకుండా తిరిగిరారని వూళ్లో అందరికి తెలుసు. ఆవూళ్లో వాళ్లే పెద్ద దిక్కు. పోలీసు స్టేషన్ లో పని కావాలన్నా, తాలూకాఫీసులో పనికావాలన్నా ఎవరూ చెప్పినా కావు. జెసి బ్రదర్స్ చెబితే పనులవుతాయి.వాళ్ల ఫ్యాక్షన్,దాడులు, మర్డర్లు, వాళ్ల రాజకీయాలు మనకెందుకు, సాయంకావాలని పోతే, చేస్తారు, నయానకాకుంటే భయాన చేయిస్తారని ‘తెలుగు రాజ్యం’ అడిగిన వాళ్లంతా ముక్త కంఠంతో చెప్పారు. ఇపుడున్న సిస్టమ్ లో   పేద వాళ్లపనులు జరగాలంటే అట్లాంటినాయకులుండాలని అంతా చెబుతారు. అందుకే వాళ్లకే వోట్లు పడుతూ వస్తున్నాయి.

వాళ్లనుకంటే ఏపనయినా అవుతుంది. ఉదాహరణకు ’స్వచ్ఛ తాడిపత్రి’ అమలుకావాలంటే  జెసి బ్రదర్స్ పాలసీ మాత్రమే పని చేస్తుంది. కరపత్రాలేసి, పోస్టర్లు అతికించి, న్యూస్ పేపర్లలో పే… ద్ద పే… ద్ద అడ్వర్టయిజ్ మెంట్లు వేసి ‘బాబ్బాబు చెత్త వేయవద్ద’ని ప్రభుత్వం ప్రచారం చేస్తే అది ఖర్చు దండగ. ఎవరూ మాట వినరు, సరిగదా స్వచ్ఛ తాడిపత్రి అని అరిచే వాడ్ని పిచ్చోడిలాగా చూసి వాడెల్లిపోతూనే ఇంట్లో ఉన్న చెత్తంతా రోడ్డమీదనో సైడుకాల్వలోనో వేయడం ప్రజలకలవాటు.

అందుకే జెసి బ్రదర్స్, తమని గిట్టని వాళ్లెలా ‘రౌడీయిజం’ అని పిలిచారో అదే పద్ధతి ప్రయోగించి స్వచ్ఛ తాడిపత్రి అమలు చేశారు. ప్రభాకర్ రెడ్డి తెల్ల వారుజామునే కారేసుకుని వచ్చి అంతా చూస్తుండగా చెత్త ఎత్తి,చుట్టుపక్కల వాళ్లకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయేవాడట.అంతే, ఒక్కపూటలో స్వచ్ఛ తాడిపత్రి అమలయిపోయింది.   నాకు తెలిసి, ఇండియాలో మొదటి స్వచ్చ పట్టణం ఏదయినా ఉంటే అది తాడిపత్రే.  శుభ్రత పాటించకపోతే, తాట వలుస్తామని ప్రభాకర్ రెడ్డి చెప్పాడమే దీనికి కారణమని అక్కడి ప్రజలు చెబుతారు. రోడ్లమీద చెట్లు చచ్చిపోతే, కూడాజెసి-2కు కోపం వస్తుంది. అందుకే రోడ్డు మీద చెత్త కనిపించినా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్  కనిపించినా, చెట్లు ఎండిపోయినా, చుట్టు పక్కలోల్లనందరిని ఆయన నిలేస్తాడు. చీరేస్తాడు. ఈ భయం ఆవూర్లో బాగా పనిచేసింది.

‘దండం పట్టాల్సిన చోట దండం పట్టాలి,’అనేది జెసి బ్రదర్స్ నమ్మే సామెత.

తాముంటున్నది ‘కమ్మవాళ్ల పార్టీ’ జెసి బద్రర్స్ కు బాగా తెలుసు. వాళ్లేమో పచ్చిరెడ్లు.  అయినా సరే, అనంతపురం జిల్లా లో తెలుగుదేశం పార్టీ కమ్మకంపుగొడుతూ ఉందని నానా రభస చేసిన నాయకుడు మొనగాడు జెసి దివాకర్ రెడ్డి. ఇది ఆయన్ని ఒక విధంగా ఒక సెక్షన్ లో హీరోని చేసింది. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అది తనకు వినిపించనేలేదన్నట్లుగా ఉన్నారు. కారణం, అక్కడి రాజకీయాల మీద  జెసిల పట్టు అలాంటిది.

రాజకీయాల్లో సంస్థానాలను అంతా తయారుచేసుకుంటున్నపుడు జెసి బ్రదర్స్ తాడిపత్రి సంస్ధానం తయారుచేసుకున్నారు.దానికోసం వారు తమకు తెలిసిన యుద్ధవిద్యలన్నీ రాజకీయాల్లో ప్రయోగించారు. అలాంటి మార్షల్ లా తాడిపత్రికే పరిమితం కాదు. రాష్ట్రమంతా ఉంది.  ప్రకాశం జిల్లాలో ఉంది, శ్రీకాకుళంలో ఉంది, గుంటూరులో ఉంది. కడపలో ఉంది.

ఇపుడు ఈ రామాయణమంతా ఎందుకంటే, ఒకేసారి జెసి బ్రదర్స్ ఇద్దరు రాజకీయాలను విఆర్ ఎస్ తీసుకుంటున్నారు. ఈ ప్రకటన సోదరులిద్దరూ చేశారు. ఇదో పెద్ద చర్చనీయాంశమయింది,  రాష్ట్రంలో, జిల్లాలో, తాడిపత్రిలో కూడా. ఈ విలేకరి ఒర అరగంట తాడిపత్రి బస్టాండులో బస్సు కోసం ఎదురుచూస్తూన్నపుడు వినబడిన చర్చ,వాదులాటలు చూస్తే ఇక్కడి జన జీవితం మీద వారి ప్రభావం ఎంతవుందో తెలుస్తుంది. ఇద్దరు ఎంత దరుసుగా ఉంటారో అంత చమత్కారంగా కూడా ఉంటారు, అందుకే వాళ్లు చేసే ప్రతి స్టేట్మెంట్, అనే ప్రతిమాట సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇలాంటపుడు  ఇద్దరూ కొడుకుల్ని వారసులుగా ప్రకటించారు. జెసి-1 కొడుకు పవన్ అనంతపురం  లోక్ సభకు,  జెసి- కొడుకు తాడిపత్రి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని ప్రకటించివోటర్ల బ్లెస్సింగ్స్ కూడా అడుగేస్తున్నారు.

కొడుకుల కాలంలో జెసి ఫామిలీ హవా నడుస్తుందా? ఇపుడు ఏదయినా పనికావాలంటే జెసిని పట్టుకుంటే అవుతుందనే ధీమా తాడిపత్రివోటర్లలో ఉంది. ఆ ధీమా వాళ్ల వారసులిస్తారా?

ఏమయినా సరే, జెసి బ్రదర్స్ లేని రాజకీయాలు చప్పగా ఉంటాయి. అంత రక్తి కట్టవు.

అయితే,తాము రిటైరవుతున్నామని చెబుతున్నా, కీలకమయిన 2019 ఎన్నికల్లో వాళ్లని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వదలుకోడని అంతా చెబుతున్నారు. ‘ఎందుకంటే, ఈసారి గెలిస్తేనే కొడుకు లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు,  కొడుకును ముఖ్యమంత్రిని చేశాక ఆయన ఢిల్లీకి వెళ్లిపోతాడు, కాబట్టి గెల్చాల. గెలిపియ్యాలంటేదివాకర్ రెడ్డి ఉండాలా,’ అంటాడ వరదా సుబ్బారాయుడనే సగటుమనిషి. జెసి కెపాసిటి మీద సుబ్బరాయుడికి విపరీతమయినమ్మకం. ఎట్నోకత గెలిపిస్తాడాయన  అంటాడు.  కొడుకులవల్ల ఏం కాదుసార్ అని ఇక్కడి టిబంకులవాళ్లు  కూడా చెబుతారు. కాబట్టి వాళ్ల రిటైర్ మెంటు అనుమానమేనా…