అదనపు కట్నం కోసం మెట్టినింటి వారి వేధింపులు తాళలేక ఓ మహిళ న్యాయం కోసం ఆందోళనకు దిగింది. భర్త ఇంటి ఎదుట చంటిబిడ్దతో బైఠాయించింది. ఈ ఘటన బుధవారం నగరంలోని శ్రీనగర్కాలనీలో చోటు చేసుకుంది
అనంతపురం శ్రీనగర్కాలనీకి చెందిన శ్రీనివాసులుకు, గుంతకల్లుకు చెందిన యామినితో 2016 లో వివాహమైంది. అప్పట్లో కట్నం కింద రూ.15 లక్షల నగదు, 23 తులాల బంగారు నగలు, రెండు సెంట్ల స్థలం ఇచ్చారు. పెళ్లి అయినప్పటి నుంచి అదనపుకట్నం కోసం భర్త, అత్తమామాల నుంచి వేధింపులు ప్రారంభమాయ్యియి. భర్త తనను మానసికంగా, శారీరకంగా హింసించడంతో పాటు జేఎన్టీయూ అనుబంధ ఓటీఆర్ఐలో ఉద్యోగానికి రాజీనామా చేయించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ విషయంపై గతంలో గుంతకల్లు వన్టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపింది. అయితే పోలీసుస్టేషన్కు రావాలని చెప్పినా బేఖాతరు చేస్తున్నట్లు ఆరోపించింది. గత కొన్నాళ్లుగా యామిని కాపురానికి రానివ్వడం లేదు. దీంతో యామిని తనకు న్యాయం చేయాలని చంటిబిడ్డతో భర్త ఇంటి ఎదుట ధర్నాకు దిగింది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలికి సర్దిచెప్పారు. దీంతో నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తమామలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
