అందరూ కలిసి జగన్ ను టార్గెట్ చేయలేదా ?

చంద్రబాబునాయుడు దివాలాకోరు రాజకీయాలకు తెరలేపినట్లే కనబడుతోంది. తత్లీ తుపానును కూడా రాజకీయానికి వాడుకోవటం, ప్రతిపక్షాల తమపై దాడి చేస్తున్నాయని పదే పదే చెబుతూ సానుభూతి కోసం ప్రయత్నిస్తుండటమంతా దివాలాకోరు రాజయానికి నిదర్శనమే.  పార్టీ నేతలతో మాట్లాడుతూ, బిజెపి, వైసిపి, టిఆర్ఎస్, జనసేన అన్నీ కలిపి తెలుగుదేశాన్ని టార్గెట్ చేశాయంటూ చంద్రబాబు మరీ దిగజారిపోయి మాట్లాడుతున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని తన భుజాలను తానే చరుచుకుంటూ తన డప్పు తానే కొట్టుకునే చంద్రబాబు కూడా ఇంత దిగజారిపోతారని అనుకోలేదు.

 

బిజెపి, వైసిపి, టిఆర్ఎస్, జనసేనలకు చంద్రబాబు ఇపుడు ప్రతిపక్షం. మరి, ప్రతిపక్ష నేతను దెబ్బ కొట్టాలని పై నాలుగు పార్టీలు అనుకోవటంలో తప్పేంటి ? ఏపి రాజకీయాల్లో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలని చంద్రబాబు చేయని ప్రయత్నలేదుకదా ? అంతెందుకు 2014లో జగన్ కు వ్యతిరేకంగానే కదా చంద్రబాబు బిజెపి, పవన్ కల్యాణ్ ను బ్రతిమలాడి పొత్తులు పెట్టుకున్నది ? మరి, అప్పుడు బిజెపి, పవన్ కల్యాణ్ మద్దతుతో జగన్ ను  చంద్రబాబు ఒంటిరిని చేయలేదా ?

 

ప్రత్యర్ధులను దెబ్బ కొట్టటానికి ప్లాన్లు వేయటం రాజకీయాల్లో సహజమే కదా ? మరి ఈ విషయం చంద్రబాబుకు తెలీదా ? తెలిసీ మాట్లాడుతున్నారంటే చంద్రబాబులో భయం స్పష్టంగా కనబడుతోంది. పైగా ధవళేశ్వరం బ్రిడ్జిపై జనసేన కవాతు బాగా జరిగిందని తెలంగాణా మంత్రి కెటియార్ అభినందించటం కూడా చంద్రబాబును ఎక్కడో కెలికినట్లే ఉంది. తిత్లీ తుపాను బాధితులకు సానుభూతి చూపలేదని చంద్రబాబు కెటియార్ ను ప్రశ్నించటం విచిత్రంగా ఉంది.

 

నిజానికి ఏపిలోని శ్రీకాకుళంలో తుపాను వస్తే తెలంగాణాలో మత్రి కెటియార్ ఎందుకు స్పందించాలి ? స్పందించటం, స్పందిచకపోవటమన్నది కెటియార్ వ్యక్తిగతం. స్పందించిన వైసిపి రాజకీయం చేస్తోదంటూ వాళ్ళపై చంద్రబాబు మండిపడితున్న విషయం అందరూ చూస్తున్నదే. అంటే తిత్లీ తుపానుపై స్పందించినా సమస్యే, స్పందిచకపోయినా చంద్రబాబుకు సమస్యేనా ?