బాపట్ల టీడీపీ అభ్యర్ధిపై సస్పెన్స్… “బరిలో ఆ ముగ్గురు”

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంక్రాంతి తర్వాత తొలిదశ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తానని వెల్లడించారు. ఇక అప్పటి నుండి టికెట్ ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ ఎవరికి ఇవ్వాలి అనే అంశం చిక్కుముడిగా మారింది. ఇంతకీ బరిలో ఉండేదెవరు? త్యాగం చేసేది ఎవరు? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ తరహా నియోజకవర్గాల జాబితాలో గుంటూరు జిల్లాలోని బాపట్ల సెగ్మెంట్ కూడా ఉంది. బాపట్లలో ఈసారైనా టీడీపీ గెలవాలి…ఎందుకంటే వరుసగా మూడేళ్ళ నుండి ఓటమి చూస్తోంది. ఈసారి నెగ్గకపోతే పూర్తిగా పట్టుకోల్పోయే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని నియోజకవర్గాలు కంటే బాపట్ల నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో చారిత్రక ఘట్టాలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. మొట్టమొదటి ఆంధ్రమహాసభ జరిగింది ఈ సెగ్మెంట్ లోనే.. మద్రాస్ నుండి విడిపోయి ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న తీర్మానం జరిగింది ఇచ్చోటనే. మనం గొప్పగా చెప్పుకునే ఎడ్యుకేషన్ హబ్ ఎన్నో ఏళ్ళ కిందటే బాపట్లలో ఏర్పడింది. స్వాతంత్య్రానికి ముందు ఇక్కడ వ్యవసాయ కళాశాల నిర్మించబడింది. యాభయేళ్ల క్రితమే బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల పెట్టారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంప్ కూడా ఉంది. సూర్యలంక బీచ్ మరో ప్రత్యేకత. 

బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల మండలం, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాలు ఉన్నాయి. దాదాపు లక్ష యాభై ఆరువేల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో అధికంగా ఎస్సి, ఎస్టీలు 45 వేలమంది ఉన్నారు. రెడ్లు 30 వేలు ఉండగా, కాపులు కూడా దాదాపు 30 వేలమంది ఉన్నారు. తర్వాతి స్థానాల్లో ఇతర కులాల వారున్నారు. రెడ్డి సామాజికవర్గం గెలుపోటములపై ప్రభావం చూపిస్తుంది ఈ నియోజకవర్గంలో.

గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎంపిక సునాయాసంగా అయిపోయింది. కానీ ఈసారి మాత్రం క్లిష్టతరంగా మారింది. ఎందుకంటే ఇక్కడ టీడీపీ టికెట్ పై ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. వారిలో ఒకరు టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, అలాగే తనయుడి కోసం మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, వేగేశ‌న‌ ఫౌండేషన్ అధినేత వేగేశ‌న‌ నరేంద్ర వర్మ టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ ఆశావాహులే కాదు నియోజకవర్గ ప్రజలు కూడా ఎవరికి సీటు దక్కుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అన్నం సతీష్ ప్రభాకర్

కాగా 2014 ఎన్నికలో ఓటమిపాలైన అన్నం సతీష్ కు టికెట్ దక్కే ఛాన్స్ లేదని సమాచారం. ఎందుకంటే ఇప్పటికే ఆయన పలు వివాదాల్లో ఉన్నారు. నియోజకవర్గంలో కూడా ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉన్నందున చంద్రబాబు కూడా అన్నం సతీష్ తీరుపై అసహనం చెందినట్టు కొందరు నియోజకవర్గ నేతలు చెబుతున్నారు. దీంతో ఆయనకి ఈసారి సీటు కేటాయించరు అని పార్టీ అంతర్గతవర్గాల సమాచారం.

వేగేశ‌న‌ నరేంద్ర వర్మ

ఇక పార్టీలో ఏ అధికారిక పదవిలో లేనప్పటికీ టీడీపీ నాయకుడు, వేగేశ‌న‌ ఫౌండేషన్ అధినేత వేగేశ‌న‌ నరేంద్రవర్మ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గమంతా కలియతిరుగుతూ ప్రజలకి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా పార్టీ పేరిట అనేక కార్యక్రమాలు చేపడుతూ వ్యక్తిగతంగానూ, పార్టీని బలపరిచే పనిలో బిజీగా ఉన్నారు. తమ ఫౌండేషన్ తరపున వివిధ సేవ కార్యక్రమాలు చేపడుతూ నియోజకవర్గంలో కొత్త ఇమేజ్ సంపాదించుకుంటున్నారు. అందులోను ఈయన లోకేష్ కి మంచి సన్నిహితుడు కావడంతో టికెట్ రావచ్చని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరి లోకేష్ నరేంద్రవర్మకు ఎంతవరకు హెల్ప్ చేస్తారో చూడాలి.

గాదె వెంకటరెడ్డి

మరొక సీనియర్ రాజకీయనాయకుడు గాదె వెంకటరెడ్డి కూడా తన కొడుకు మధుసూదన్ రెడ్డికి బాపట్ల టికెట్ ఇప్పించే దిశగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే అధిష్టానం మాత్రం కొడుకుని కాకుండా ఆయన్నే బరిలోకి దింపితే ప్రయోజనం ఉంటుందని భావిస్తోందని సమాచారం. గాదె వెంకటరెడ్డి కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రికార్డు ఆయనది. బాపట్ల నియోజకవర్గంలో ఆయనకి మంచి పేరుంది. బలమైన నాయకుడు కూడా.

గడిచిన మూడు ఎన్నికల్లో బాపట్లలో టీడీపీ చోటు దక్కించుకోలేకపోయింది. అందులో రెండుసార్లు గాదె వెంకటరెడ్డి కాంగ్రెస్ నుండి గెలుపొందగా గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎన్నికయ్యారు. ఈసారి ఎలాగైనా బాపట్లలో పాగా వేయాలని టీడీపీ అధిష్టానం యోచిస్తోంది. అందుకే కొత్తవారిని కాకుండా సీనియర్ నాయకుడైన గాదె వెంకటరెడ్డిని బరిలో నిలబెట్టాలని ఆలోచిస్తుంది. అందుకు ఆయన అంగీకరిస్తే సరే… లేదంటే వేగేశ‌న‌ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్ననేపధ్యంలో ఆయనకే టికెట్ దక్కే అవకాశం ఉందని స్థానిక నేతలు చెబుతున్నారు.