ఆంధ్ర ప్రదేశ్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగియడంతో రాజకీయ పార్టీలు ఇప్పుడు ‘పురపోరు’కు సిద్దమైనాయి. రాష్ట్రంలోని మిగిలిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు ఒక ఎత్తు అయితే… విజయవాడ, గుంటూరు కార్పొరేషన్ల ఎన్నికలు మరో ఎత్తు. మూడు రాజధానుల అంశంతో ముడిపడి ఉండటంతో ఇక్కడి ప్రజా తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అమరావతికి కట్టుబడి ఉన్న టీడీపీకి ఈ రెండు చాలా కీలకం. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్న అధికారపక్షం వైసీపీ తేలికగా తీసుకునే అవకాశం లేదు. ఈ రెండు చోట్లా వైసీపీ పాగా వేయలేకపోతే.. రాజధాని తరలింపే కారణమనే ప్రచారం మొదలవుతుంది.
అదే సమయంలో టీడీపీ గెలుచుకోలేకపోతే అమరావతి ప్రభావం లేదనే వాదన వినిపించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ రెండు పార్టీలకు ఇవి కీలకంగా మారాయి. నాయకత్వ లోపంతో మున్సిపల్ కార్పొరేషన్లలో టీడీపీ ఎదురీదుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయవాడలో నాయకుల కొరత లేకున్నా అక్కడ వర్గపోరు పతాకస్థాయికి చేరుకుంది. విజయవాడ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే మూడు నియోజవకర్గలకుగాను సెంట్రల్, తూర్పులలో గట్టి నాయకత్వం ఉంది. పశ్చిమ నియోజకవర్గ వ్యవహారాన్ని బుద్దా వెంకన్న, నాగుల్ మీరా చూస్తున్నారు. బెజవాడలో టీడీపీ నాయకులంతా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు.
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే టీడీపీకి విజయవాడ-గుంటూరులలో గట్టి పట్టు ఉంది. కాకపోతే మేయర్ ఎన్నికల్లో పార్టీని సమర్థమంతంగా లీడ్ చేసే వారే దొరకడం లేదట. చంద్రబాబు మాత్రం ప్రచారానికి సై అంటున్నారు. కేవలం స్వయంకృతాపరాధంతోనే పార్టీ నష్టపోయే పరిస్థితి ఉందట. అధినేత ఇప్పటికే దృష్టిపెట్టినా.. ఎంతవరకు వీరు కలిసి పని చేస్తారో చెప్పలేకపోతున్నారు. దీంతో పక్కా వ్యూహాలతో ఎన్నికలకు వెళుతున్న వైసీపీని కొట్టడం టీడీపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈజీ కాదన్నది తమ్ముళ్ల వాదన.