అనూహ్యంగా మళ్ళీ లైమ్‌లైట్‌లోకి వచ్చిన విజయసాయిరెడ్డి.!

ఏమయ్యిందోగానీ, గత కొన్నాళ్ళుగా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి మౌనంగా వుంటూ వచ్చారు. ఎలాగైతేనేం, ఆయన మౌనం వీడారు. మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. ఢిల్లీ వ్యవహారాలకే పరిమితమవుతూ వచ్చిన విజయసాయిరెడ్డి, పార్టీలో తిరిగి పూర్వ వైభవం అందుకునేలా వున్నారు.

పార్టీకి సంబంధించిన వివిధ విభాగాలపై మళ్ళీ పట్టు లభిస్తోంది విజయసాయిరెడ్డికి. దాంతో, ఆయన మళ్ళీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అవుతున్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాలు తాము ఇస్తోంటే, అది ఓర్వలేక సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీడీపీ, ఇప్పుడు పేదల్ని బాగు చేసే మేనిఫెస్టో అంటూ మాయాఫెస్టోని తెరపైకి తెచ్చిందని ఎద్దేవా చేస్తూ విజయసాయిరెడ్డి ట్వీటేశారు.

అయితే, మునుపటిలా విజయసాయిరెడ్డి ట్వీట్లకు వైసీపీ శ్రేణులు స్పందించడంలేదు. టీడీపీ శ్రేణులు మాత్రం, విజయసాయిరెడ్డికి కౌంటర్ ెటాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

పార్టీలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి పెత్తనం పెరిగాక, విజయసాయిరెడ్డి ప్రాభవం తగ్గుతూ వచ్చింది. సరిగ్గా 2024 ఎన్నికలకు ఏడాది ముందర మళ్ళీ కీలక విభాగాల పగ్గాలు విజయసాయిరెడ్డికి దక్కనుండడం గమనార్హం. వైసీపీలో విజయసాయిరెడ్డికి అంటూ ఓ పర్టిక్యులర్ గ్రూపు వుంది. ఆ ఫాలోయింగ్ వేరే లెవల్ అంతే.!