శ్రీదేవితో బాలయ్య నవ్వులు… బావ బయటలేడన్న బాధ లేదా?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఉదయం బ్లాక్ టీ, మధ్యాహ్నం బ్రౌన్ రైస్, రాత్రికి పుల్కాలు తింటూ ఒంటరిగా ఉంటున్నారు. ములాకత్ లో కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసినా గడియారం చూసుకుంటూ మాట్లాడాల్సిన పరిస్థితి. దీంతో… ఆ రోజు నూంచీ నారా వారి ముఖాల్లో నవ్వనేది కనిపించలేదు.

చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఇప్పటివరకూ లోకేష్ ఫేస్ లో ఆ సీరియస్ నెస్ తగ్గలేదు. నవ్వు లేదు.. మరో ఎక్స్ ప్రెషన్ లేదు.. అదే దిగాలుతనం, అదే డల్ నెస్ తో విచారంగా ఉంటున్నారు. తండ్రికి బెయిల్ ఎప్పుడొస్తుందా అని జైలు బయటే కార్ వేన్ లో ఎదురుచూస్తున్నారు. కానీ… బయట బాలయ్య మాత్రం సందడిగా జోకులేసుకుంటూ గడుపుతుండటం గమనార్హం.

మంగళవారం మైకులముందు జగన్ పై సంస్కృతంలో ధ్వజమెత్తిన బాలకృష్ణ.. ఈరోజు పార్టీ నాయకులతో జోకులేస్తూ సరదాగా గడిపారు. తనను కలవడానికి వచ్చిన నాయకులతో సరదాగా మాట్లాడారు. ఈ సమయంలో బాబు బావ జైలులో ఉన్నారన్న బాధ ఆయనలో ఏమాత్రం కనపడకపోవడం గమనార్హం.

తాజాగా వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల నారా లోకేష్ యువగళం యాత్రలో తన కుమార్తెలతో కలసి ఆమె పాల్గొన్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు జైల్లో ఉండగా… ఆమె బాలయ్యను కలిశారు.

అవును… మంగళగిరి టీడీపీ కార్యాలయంలో తన కుమార్తెలతో సహా బాలయ్యను కలిశారు ఉండవల్లి శ్రీదేవి. ఈ సందర్భంగా బాలయ్యతో సెల్ఫీలు దిగారు. బాలయ్య కూడా అంతే హుషారుగా వారితో మాట్లాడుతూ జోకులేస్తూ నవ్వులూ పూయించారు. దీంతో… చంద్రబాబు అరెస్ట్ తర్వాత గంభీరంగా మారిపోయిన మంగళగిరి టీడీపీ ఆఫీసు తాజాగా నవ్వుల మయంగా మారిపోయింది.