తిరుమల ‘టెంపుల్ హాలిడే’, చేతులు కాల్చుకున్న టిటిడి

తిరుమలేశుని టెంపుల్ హాలిడేని సవరించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్ణయించింది.  మహాసంప్రోక్షణం పేరుతో అగస్గు 9 నుంచి 17 దాకా ప్రజల దర్శనానికి సెలవు ప్రకటిస్తూ టిటిడి బోర్డు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇది బాగా విమర్శలకు తావిచ్చింది. టిటిడి ఆశయం హిందూ ధర్మ పరిరక్షణ. అయినా సరే, హిందూ ఆగమ శాస్త్ర పండితులను, కంచి మఠం వంటి మఠాధిపతులను ఎవరిని సంప్రదించకుండా పుట్టాసుధాకర్ యాదవ్ నాయకత్వంలోని టిటిడి బోర్డు అత్యవసరంగా సమావేశమయి  దర్శనానికి శెలవులు ప్రకటించింది. ప్రతి 12 సంవత్సరాలకొకసారి ఈ సంప్రోక్షణం జరుగుతుందని టిటిడి ప్రకటించినా, గతంలో ఇలా దేవాలయాన్ని మూసిసి సంప్రోక్షణ నిర్వహించిన దాఖలా లేదు. శెలవులు ప్రకటించడమే కాకుండా లోపల జరిగే కార్యక్రమాలేవీ రికార్డు కాకుండా సిసిటివి కెమెరాలను కూడా మూసేయాలని నిర్ణయించడంతో టిటిడి బోర్డు నిర్నయం మీద సర్వత్రా అనుమానాలొచ్చాయి. ఏవో రహస్య కార్యక్రమాలను నిర్వహించబోతున్నారని వదంతులు వచ్చాయి.

డబ్బున్న పార్టీనేతలే టిటిడి చెయిర్మన్లు అవుతారు. పుట్టాసుధాకర్ టిటిడి ఛెయిర్మన్ అయిన రహస్యం ఇదే.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కి రాజకీయంగా ఎలాంటి ముప్పురాకుండా తిరుమల గుడి లో ప్ర్యతేక పూజలు సంప్రోక్షణం పేరుతో నిర్వహిస్తున్నారని టిడిపి రాజకీయ ప్రత్యర్థులు చెబుతున్నారు.  రాష్ట్రంలో టిటిడికి ఎలాంటి విఘ్నాలు లేకుండా చూసేందుకు  టిటిడి ఛెయిర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్ ఈ రహస్యపూజలు చేస్తున్నారని కూడా చెబుతున్నారు. చాలా వివాదాల తర్వాత ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడయిన పుట్టా సుధాకర్ యాదవ్ ను  టిటిడి ఛెయిర్మన్ గా నియమించారు. ఆయన నియామకమే కాదు నిర్ణయాల వల్ల   టిటిడి ఈ మధ్య రకరకాల వివాదాల్లో చిక్కుకుంది. ఆలయానికి సెలవులు ప్రకటించి, భక్తులెవరూ తిరుమల రావద్దని చెప్పడం వీటన్నింటిలోకి చాలా తీవ్రమయిన  వివాదంగా చెబుతున్నారు.

విశాఖపట్టణం శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఈ చర్య పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  నిజానికి ఆగమ శాస్త్రం ప్రకారం మహా సంప్రోక్షణ వంటి పవిత్ర కార్యక్రమం జరిగే విధానాన్ని భక్తులంతా తిలకించి తరించాలని ఆయన అంటున్నారు. అలాంటిది  ఆ సమయంలోనే సీసీ కెమెరాలను సైతం ఆపివేస్తామంటూ టీటీడీ ప్రకటించడం పై స్వామీజీ  విస్మయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రుషీ కేష్ పర్యటనలో ఉన్న స్వామీజీ  టీటీడీ నిర్ణయంపై ఒక ప్రకటన విడుదల చేశారు. టీటీడీ పాలకమండలి, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన చెందారు.

తిరుమలేశుని గుడిని ఆలయ సంప్రదాయాల ప్రకారం కాకుండా అధికారపార్టీకి అనువైన రీతిలో నిర్వహించాలనుకోవడం జరగుతూ ఉందని, దీనికోసం అక్కడ అధికారులను, పూజారులను కూడా టిడిపి అనుకూలమయిన వారినే నియమిస్తున్నారని విమర్శలొచ్చాయి. ఈ వివాదం రాజకీయం అవుతున్నదని గ్ర హించిన చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి అధికారులను ‘మందిలించి’నట్లు తెలుస్తున్నది. క్రాప్ హాలిడే లాగా టెంపుల్ హాలిడే ఏమిటని ప్రశ్నించినట్లు సమాచారం. అంటే ఇదంతా ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగిందని చెప్పేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయని దీనిని బట్టి అర్థమవుతుంది. తిరుమలలో ముఖ్యమంత్రికి తెలియకుండా ఒక కీలకమయిన నిర్ణయం తీసుకోవడం సాధ్యమా?

ఏమయినాసరే ముఖ్యమంత్రి స్పదించారని  సమాచారం. భక్తులను పూర్తిగా నిషేధించడం సరికాదని ఆయన సలహా ఇచ్చారని, దీనితో మహా సంప్రోక్షణ సమయం లో రోజుకు 20 నుంచి 25 వేల మంది భక్తులకు అనుమతిస్తారని చెబుతున్నారు. కాసేపట్లో ఈ మేరకు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.  సంప్రోక్షణ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగ్గిన చర్యలు తీసుకుంటామని టిటిడి ఇవొ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

ఎవరిని దర్శనానికి అనుమతించాలో  24వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామనిఇవొ చెప్పారు. అయితే, ఎవరిని అనుమతిస్తారనే ది మరొక వివాదానికి దారితీసే అవకాశం ఉంది.రాజకీయ సిఫార్స తో వచ్చేవారినే అనుమతిస్తారా?

‘సెలవు రోజులు కావడంతో ఎక్కువ మంది భక్తులు తరలివస్తే, భక్తులుకు ఇబ్బంది కలుగుతుంది. భక్తులు మనోభావాలు దెబ్బతినకూండా నిర్ణయాలును పున:సమిక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని సింఘాల్ చెప్పారు. ఆగస్టు 11వ తేదిన 9 గంటలు, 12వ తేదిన 4 గంటలు, 13వ తేదిన 4గంటలు, 14వ తేదిన 5గంటలు, 15వ తేదిన 5గంటలు, 16వ తేదిన 4గంటలు మాత్రమే భక్తులు దర్శనం కల్పించవచ్చని అనిల్ కుమార్ సింఘాల్  అంటున్నారు.