Tirumala Hills: తిరుమల కొండపై అలాంటి ఫుడ్‌కు గుడ్‌బై… టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల క్షేత్రంలో భక్తుల ఆరోగ్యం, భక్తి వాతావరణం దృష్ట్యా టీటీడీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమలలో చైనీస్ ఫుడ్ ఐటమ్స్ విక్రయం పూర్తిగా నిషేధం కిందకి వస్తుందని అధికారికంగా ప్రకటించింది. ఇటీవల భక్తుల నుంచి లభించిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.

తిరుమలలోని హోటల్ యజమానులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఫ్రైడ్ రైస్, నూడుల్స్, మంచూరియా వంటి చైనీస్ తరహా వంటకాలను ఇకపై విక్రయించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. భక్తులకు శుద్ధమైన, ఆరోగ్యకరమైన భారతీయ వంటకాలనే అందించాలని సూచించబడింది. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రతి హోటల్ యజమాని తమ భాగం పోషించాలని అధికారుల తేలికైన హెచ్చరిక.

అంతేకాక, హోటల్ నిర్వహణలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, సిబ్బంది సంప్రదాయ వస్త్రధారణలో విధులు నిర్వర్తించాలని టీటీడీ పేర్కొంది. ప్రతి హోటల్ వద్ద ట్రేడ్ లైసెన్స్, జీఎస్టీ ధృవీకరణ పత్రాలు స్పష్టంగా ప్రదర్శించాల్సిన అవసరం ఉందని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలనే సూచన ఇచ్చారు.

ధరల పట్టికలను ప్రతి దుకాణంలో ప్రదర్శించడం, కచ్చితంగా నిర్ణీత ధరలకే విక్రయాలు జరగడం, లైసెన్సుల పునరుద్ధరణను సకాలంలో పూర్తి చేయడం వంటి అంశాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని టీటీడీ స్పష్టం చేసింది. భక్తుల విశ్వాసం నిలుపుకోవడంలో ఈ నిర్ణయాలు కీలకమని అధికారులు అభిప్రాయపడ్డారు.

జగన్ సింహం || Analyst Ks Prasad EXPOSED Ys Jagan Vs Nara Lokesh || Chandrababu || Telugu Rajyam